కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది: మోడీకి డబ్ల్యూహెచ్ఓ ఫోన్ కాల్: సంప్రదాయ వైద్యంతో వైరస్కు చెక్
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను రూపుమాపే దిశగా మరో అడుగు ముందుకు పడింది. కోవ్యాక్స్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోందనే సంకేతాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమలు చేయనున్న కోవ్యాక్స్ కార్యక్రమానికి అన్ని దేశాల మద్దతును కూడగట్టుకుంటోంది. ఇందులో భాగంగా- డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ అథనొమ్ హెబ్రియేసుస్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు.
Recommended Video
కోవ్యాక్స్ ప్రోగ్రామ్లో..
కోవ్యాక్స్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. కోవ్యాక్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆయా దేశాల జనాభాకు అనుగుణంగా డోసులను పంపిణీ చేయడం లేదా.. దాన్ని ఉత్పత్తి చేయడాని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇస్తుంది. కోవ్యాక్స్ కార్యక్రమం కోసం డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. కరోనా బారిన పడిన దేశాలకు ప్రాధాన్యతను ఇస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కొద్దిరోజుల కిందటే- మెక్సికో ప్రభుత్వాన్ని సంప్రదించింది. కోవ్యాక్స్ను సరఫరా చేస్తామని భరోసా ఇచ్చింది. దీనికోసం మెక్సికో ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించింది.
మెక్సికో.. నార్వే..
మెక్సికో.. అమెరికా, భారత్ తరువాత.. అత్యధిక కరోనా మరణాలను నమోదు చేస్తోన్న దేశం. మరణాలు రేటు కూడా అత్యధికంగా ఉంటోంది. మొత్తం పాజిటివ్ కేసులు 9,78,351 ఉండగా.. 95, 842 మంది మరణించారు. చాలా దేశాలతో పోల్చుకుంటే మరణాల రేటు మెక్సికోలో అధికంగా ఉంటోంది. భారత్లో కరోనా మరణాలు లక్షా పాతికవేలను దాటేశాయి. 1,28,165 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో కోవ్యాక్స్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే భరోసాను కల్పిస్తోంది డబ్ల్యూహెచ్ఓ. ఈ కార్యక్రమం కోసం నార్వే.. 133 మిలియన్ యూరోలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించింది.
భారత సహకారం కోసం..
తాము చేపట్టబోయే కోవ్యాక్స్ కార్యక్రమానికి మద్దతు కావాలంటూ టెడ్రోస్ ప్రధానమంత్రికి విజ్ఙప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ను రూపుమాపడానికి డబ్ల్యూహెచ్ఓ చేపట్టిన కార్యక్రమాల పట్ల ప్రధాని ప్రశంసించారు. సంప్రదాయక వైద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
సంప్రదాయ వైద్యంపై
వేర్వేరు దేశాల్లో వేర్వేరు సంప్రదాయక వైద్య చికిత్స, విధానాలు ఉన్నాయని, వాటిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ సూచించారు. సంప్రదాయక వైద్యాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రాణాంతక వైరస్లను తరిమి కొట్టడం సులభతరమౌతుందని చెప్పారు. సంప్రదాయ వైద్యంపై పరిశోధనలను సాగించడానికి, శిక్షణ ఇవ్వడానికి తమవంతు సహకారం అందిస్తామని టెడ్రోస్ హామీ ఇచ్చారు. ఈ దిశగా తక్షణ చర్యలను చేపడతామని వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తాము గుర్తించామని అధనొమ్ తెలిపారు.