అత్యంత నిజాయితీపరుడు ఆయనే: బీజేపీ ఎమ్మెల్యేపై రాహుల్, అలా ఎందుకన్నారంటే..?
చండీగఢ్: హర్యానా ఎమ్మెల్యే బక్షిష్ సింగ్ భారతీయ జనతా పార్టీలోనే అత్యంత నిజాయితీ పరుడంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక అంతకుముందు బక్షిష్ సింగ్ మాట్లాడిన మాటలే కారణం కావడం గమనార్హం.
ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు
హర్యానాలో సోమవారం(అక్టోబర్ 21న) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే బక్షిష్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా ఓటు బీజేపీకే వెళుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ.. ఈ నేతను నిజాయితీపరుడంటూ వ్యాఖ్యానించారు.
ఏ మీట నొక్కినా.. బీజేపీకే..
‘మీరు ఎవరికి ఓటేస్తున్నారో మాకు తెలియదనుకోకండి. కావాలనుకుంటే మేం అది తెలుసుకోగలం. ఎందుకంటే మోడీజీ, మనోహర్ లాల్జీ చాలా తెలివైనవారు. మీరు ఎవరికైనా ఓటెయ్యెచ్చు. కానీ, మీ ఓటు మాత్రం కమలం గుర్తుకే వెళ్తుంది. ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు వెళుతుంది' అంటూ ఓటర్లను హెచ్చరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
నిజాయితీపరుడు ఆయనే అంటూ రాహుల్
కాగా, బక్షిష్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ మారింది. దీంతో రాహుల్ గాంధీ బక్షిష్ చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ.. బీజేపీలో ఉన్న ఏకైక నిజాయితీపరుడు ఈయనే అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఇలావుంటే, బక్షిష్ సింగ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం అధికారులు.. ఆయనకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో..
హర్యానా అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారాన్ని చేపడతామని చెబుతుంటే.. తమదే అధికారమంటూ కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతల్లో చోటు చేసుకుంటున్న విభేదాలు బీజేపీకి కలిసివచ్చే అంశంగా మారినట్లు కనిపిస్తోంది. హర్యానాతోపాటు మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 24న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.