19 నుంచి సెకెండ్ లాక్డౌన్: 28 రోజుల పాటు.. ఆ వార్తలను నమ్మొద్దు: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్కు సంబంధించిన ఓ షెడ్యూల్, ప్రొసీజర్.. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 15వ తేదీన లాక్డౌన్ను ఎత్తేస్తారని, అనంతరం 19వ తేదీ నుంచి సెకెండ్ లాక్డౌన్ ఆరంభమౌతుందని, ఈ సారి ఏకంగా 28 రోజుల పాటు కొనసాగిస్తారని అనేది దాని సారంశం. ఈ షెడ్యూల్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా విభాగం అధికారులు క్లారిఫికేషన్ ఇచ్చారు.
Recommended Video
ఈ వార్తలను నమ్మొద్దని స్పష్టం చేశారు. తాము ఎలాంటి షెడ్యూల్ను గానీ ప్రొసీజర్ను గానీ విడుదల చేయలేదని తెలిపారు. సాధారణంగా లాక్డౌన్ విధించిన సందర్భాలను అనుసరించడానికి ప్రత్యేకంగా ఓ ప్రొసీజర్ను రూపొందించుకున్నామని, ఆ ప్రొసీజర్ ఆధారంగా లాక్డౌన్ షెడ్యూల్ను రూపొందించి ఉంటారని పేర్కొంది. తాము అధికారింగా ఎలాంటి షెడ్యూల్ లేదా ప్రొసీజర్ను గానీ విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్న ఆ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 14వ తేదీన ఇప్పుడు అమల్లో ఉన్న లాక్డౌన్ సమయం ముగుస్తుంది. అయిదు రోజుల పాటు సడళింపు ఉంటుంది. మళ్లీ 19వ తేదీ నుంచి 28 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఈ 28 రోజుల లాక్డౌన్ తరువాత మరోసారి సడళింపు ఉంటుందని, అనంతరం 15 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తారనే వార్త ఒకటి విస్తృతంగా సర్కులేట్ అయిన విషయం తెలిసిందే.