షాక్: ఛోటా రాజన్కు భారత్ పాస్పోర్ట్ ఎలా?
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటా రాజన్ దగ్గర భారతదేశానికి చెందిన ప్రామాణికమైన ఒరిజినల్ పాస్ పోర్టు బయటపడటంతో ఇంటిలిజెన్స్ వర్గాలు హడలిపోయాయి. గత 20 సంవత్సరాల నుంచి పరారీలో ఉన్న ఛోటా రాజన్ చేతిలోకి భారత్ పాస్ పోర్టు ఎలా వచ్చింది అని ఆరా తీస్తున్నారు.
విదేశాలలో తలదాచుకున్న ఛోటా రాజన్ కు భారత కాన్సులేట్ ద్వార ప్రామాణిక పాస్ పోర్టు లభించడానికి ఎవరు సహకరించారు అని అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎలాంటి తనిఖీలు చెయ్యకుండానే ఛోటా రాజన్ కు పాస్ పోర్టు ఇచ్చారని స్పష్టంగా వెలుగు చూసింది.
2008 జులై 8వ తేదిన కర్ణాటకలోని మండ్యకు చెందిన మోహన్ కుమార్ పేరుతో సిడ్నీలోని భారత కాన్సులేట్ ఛోటా రాజన్ కు పాస్ పోర్టు జారీ చేసింది. అయితే ఛోటా రాజన్ ఆస్ట్రేలియా నుంచి కొత్త పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడా అని కచ్చితంగా తెలియడం లేదని అధికారులు అంటున్నారు.
నిబంధనల ప్రకారం కొత్త పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే పాత పాస్ పోర్టు నెంబర్, వివరాలు తప్పని సరిగా ఇవ్వాలి. అయితే ఛోటా రాజన్ మారు పేరుతో కొత్త పాస్ పోర్టుకు ఎలా దరఖాస్తు చేసుకున్నాడు, ఎలాంటి తనిఖీలు చెయ్యకుండా అతనికి ఎలా పాస్ పోర్టు ఇచ్చారు అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పేరు మోసిన మాఫియా డాన్ లు అవలీలగా పాస్ పోర్టులు సంపాదిస్తున్నారని మరో సారి వెలుగు చూసింది. గతంలో అబుసలేం నకిలీ పాస్ పోర్టు తీసుకున్న విషమం తెలిసిందే. ఇప్పుడు ఛోటా రాజన్, ఇంకా ఎంత మంది డాన్ లు నకిలీ పాస్ పోర్టులు తీసుకున్నారో అని అధికారులు ఆరా తీస్తున్నారు.