శశికళకు చుక్కలు: పన్నీర్ సెల్వం వెనక ఎవరు?
శశికళను, దినకరన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించేందుకు పన్నీర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన వెనక ఉన్నదెవరనేది చర్చ....
చెన్నై: మన్నార్ గుడి మాఫియాగా పేరు పొందిన శశికళ వర్గానికి చుక్కలు చూపించేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కంకణం కట్టుకున్నారు. అందుకు తగిన వ్యూహాన్ని కూడా రచించారు. దాని అమలుకు కొన్ని మెట్లు దిగి వచ్చారు కూడా. ముఖ్యమంత్రి పళనిసామితో చేతులు కలిపేందుకు సిద్ధపడ్డారు.
పన్నీర్ సెల్వం వ్యూహరచన చేసి, అమలు చేయడం వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శశికళకు, ఆమె మేనల్లుడు టిటివి దినకర్కు చుక్కలు చూపించి, వారికి రాజకీయాల్లో స్థానం లేకుండా చేయడానికి అనువైన వ్యూహాన్నే ఎంచుకున్నారు.
పన్నీర్ సెల్వం జయలలిత వెనక నీడలా మాత్రమే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. శశికళను, దినకరన్ను మట్టి కరిపించే విషయంలో ఆయన విజయం దిశగా సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో పళనిసామి కూడా దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అప్పుడు పావులు కదిపిన శశికళ
జయలలిత మరణం తర్వాత అన్నాడియంకెను తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆమె ప్రియసఖి శశికళ చేయాల్సిందంతా చేశారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనట్లు ప్రకటించుకోవడం ద్వారా పూర్తి పట్టు సాధించినట్లు కనిపించారు. దానికి తోడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించారు. తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో అనూహ్యంగా శశికళ జైలు పాలయ్యారు.
ఆ తర్వాత కూడా జాగ్రత్తగా....
జైలుకు వెళ్తూ కూడా శశికళ పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా పావులు కదిపారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా భావించిన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి పెద్ద యుద్ధమే చేశారు. తన అన్న కుమారుడు టిటివీ దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జైల్లో ఉన్నప్పటికీ ఆమె తమిళనాడులో చక్రం తిప్పుతూనే వ్చచారు. అయితే, పన్నీర్ సెల్వం మాత్రం శశికళపై యుద్ధం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ఇది శశికళకు పెద్ద షాక్...
అన్నాడియంకె అధికారిక చిహ్నం రెండాకుల కోసం దినకరన్ ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వజూపారంటూ ఢిల్లీలో కేసు నమోదైంది. ఈ సమయంలోనే పన్నీర్ సెల్వం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. శశికళ వర్గానికి చెందినవారు తప్ప మిగతావాళ్లలో ఎవరు ఏ పదవి చేపట్టినా తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ఆ రకంగా పళనిస్వామి నుంచి బలాన్ని తన వైపు లాక్కునే ప్రయత్నం చేశారు. పళనిస్వామి వర్గంతో చర్చలకుకూడా ఆయన దాన్నే ప్రాతిపదికగా తీసుకున్నారు. పన్నీర్ సెల్వం నుంచి మాజీ మంత్రి పాండ్యరాజన్, కెపి మునుస్వామి, జెసిడి ప్రభాకరన్, పళనిస్వామి వర్గం నుచి సీనియర్ మంత్రి డి. జయకుమార్, తదితరులు సయోధ్యకు పునాదులు వేసినట్లు సమాచారం.
దినకరన్పై వ్యతిరేకతతోనే....
ప్రభుత్వంలో దినకరన్ జోక్యా్ని కొంత మంది మంత్రులు భరించలేక పన్నీరు సెల్వంతో రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. ఆర్కె నగర్ ఉప ఎన్నిక వాయిదా పడినప్పటి నుంచే ఇరు వర్గాల మధ్య రాజీ చర్చలు ప్రారంభమయ్యాయి. అన్నాడియంకె (అమ్మ), అన్నాడియంకె (పురుచ్చతలైవి అమ్మ) వర్గాలుగా విడిపోవడంతో డిఎంకె విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేల్లో తేలింది. దీంతో అప్పటి నుంచే అన్నాడియంకెకు చెందిన రెండు వర్గాలు రాజీకి చర్చలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.
పన్నీర్ వెనక ఎవరున్నారు...
శశికళను, దినగరన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్న పన్నీర్ సెల్వం వెనక ఎవరున్నారనేది ఇప్పుడు మిస్టరీగానే ఉంది. ఆయన వెనక ఉన్న అదృశ్య శక్తే పనులు చక్కబెడుతున్నట్లు చెబుతున్నారు. పన్నీరు సెల్వంకు తమిళ సినీ పరిశ్రమ నుంచి మద్దతు ఎక్కువే ఉంది. అయితే, ఆయన వెనక బిజెపి ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బిజెపి మాత్రం ఆ విమర్శలను కొట్టి పారేస్తోంది.