భారత 'రత్నం' భూపేన్ హజారికా: కవి నుంచి కంపోజర్ వరకు ఈశాన్య పుత్రుడి జీవిత ప్రస్థానం
కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఈశాన్య రాష్ట్రం అస్సోంకు చెందిన కవి, గాయకుడు భూపేన్ హజారికాను కూడా భారతరత్న వరించింది. అయితే తన మరణాంతరం భూపేన్ హజారికాను ఈ అత్యున్నత పురస్కారం వరించడం విశేషం. భూపేన్ హజారికా ఎన్నో రంగాల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. కవిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, జర్నలిస్టుగా, రచయితగా, ఫిల్మ్ మేకర్గా గుర్తింపుపొందారు. అందమైన అస్సోం అందాలను తన పాట ద్వారా ప్రపంచానికి తెలియజేశారు భూపేన్ హజారికా. ఒకసారి ఈ మల్టీ టాలెంటెడ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం.
జీవితం తొలి నాళ్లలో భూపేన్ హజారికా
1926లో అస్సోం రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలోని సాదియా అనే చిన్న పట్టణంలో భూపేన్ హజారికా జన్మించారు. తన కుటుంబంలో అంతా టీచర్లే కావడం విశేషం. గౌహతిలో తన ప్రాథమిక విద్య అభ్యసించిన భూపేన్ ఆ తర్వాత వారణాసికి వెళ్లి బనారస్ హిందూ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం కొలంబియా యూనివర్శిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో పీహెచ్డీ చేశారు. అమెరికాలో ఉన్న సమయంలో ప్రముఖ అమెరికా గాయకుడు పాల్ రాబ్సన్తో పరిచయం ఏర్పడింది. ఓల్డ్ మ్యాన్ రివర్ అనే పాటను పాల్ పాడారు. అదే పాటను హిందీలో ఓ గంగా బెహెతీ హోగా ఆలపించారు భూపేన్ హజారికా. ఈ పాట నాటి కమ్యూనిస్టు నేతల నుంచి నేటి కమ్యూనిస్టు నేతలు కూడా పాడుతుంటారు.
తల్లి జోలపాటలతో సంగీతంపై మక్కువ
గిరిజనుల సంగీతం అంటే భూపేన్కు ప్రాణం. చిన్నప్పటి నుంచి గిరిజనులు పాడే పాటలు వింటూ పెరిగానని చెప్పుకొచ్చిన భూపేన్ అదే తనను సంగీత ప్రపంచంలోకి నడిపించిదని అనేవారు. తన తల్లి తనకోసం జోలపాటలు పాడటం వల్ల సంగీతంపై ఇష్టం కలిగిందని చెప్పేవారు. 1939లో ఓ అస్సామీ సినిమా ఇంద్రమాలతి కోసం తొలిసారిగా పాట పాడారు భూపేన్. ఇక ఆయన ప్రస్థానం ఒక్క అస్సామీ భాషకే పరిమితం కాలేదు చాలా హిందీ బెంగాలీ సినిమాలకు పాటలు రాసి తనే కంపోజ్ చేశారు కూడా. 1930 నుంచి 1990 వరకు సంగీత ప్రపంచంలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు భూపేన్. రుడాలి, ఎక్ పల్, దర్మియాన్, దామన్ అండ్ క్యో, పపిహా అండ్ సాజ్,లాంటి సినిమాలకు ఆయన పనిచేశారు.
జాతీయ స్థాయిలో అవార్డులు
ఇక భూపేన్ హజారికాకు జాతీయస్థాయిలో అవార్డులు వరించాయి. చమేలీ మేమ్సాబ్ చిత్రానికిగాను 1976లో ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడి కేటగిరీలో జాతీయ అవార్డు వచ్చింది. 1960లో శంకుతల సినిమాకు, 1964లో ప్రతిధ్వనికి, 1967లో లోటీగోటీ చిత్రాలకుగాను ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. . ఇక 1967 నుంచి 1972 వరకు ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు భూపేన్. 1977లో పద్మశ్రీ అవార్డు, 1987లో సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డులు అందుకున్నారు. 1999 నుంచి 2004 వరకు సంగీత్ నాటక్ అకాడెమీకి ఛైర్మెన్గా కూడా వ్యవహరించారు. 2004లో బీజేపీ టికెట్పై గౌహతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన భూపేన్ హజారికా.. ఓటమి పాలయ్యారు. 2011లో 85 ఏళ్ల వయస్సులో భూపేన్ హజారికా తుదిశ్వాస విడిచారు.