ఎవరీ విప్లప్ కుమార్?: త్రిపుర తదుపరి సీఎం ఆయనే..
అగర్తలా: సీపీఎం కంచుకోటను బద్దలు కొట్టి త్రిపురలో పాగావేసిన బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. రెండున్నర దశాబ్దాల పాటు సాగిన మాణిక్ సర్కార్ అప్రతిహత నాయకత్వం ఇప్పుడు బీజేపీ చేతుల్లోకి మారబోతోంది. ఈ నేపథ్యంలో త్రిపుర కొత్త సీఎంగా బీజేపీ ఎవరిని నియమించబోతుందన్న ఆసక్తి నెలకొంది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్(48)కే పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 2016 జనవరి 7 నుంచి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాజీ ఆర్ఎస్ఎస్ వలంటీర్ అయిన బిప్లవ్.. గతంలో ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గానూ పనిచేశారు.
బిప్లవ్ స్వస్థలం త్రిపురలోని గోమోటి. స్కూలింగ్ త్రిపురలోనే పూర్తి చేసుకున్న విప్లవ్.. ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. పదిహేనేళ్ల క్రితం ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఆర్ఎస్ఎస్ వలంటీర్ గా చేరారు.
అగస్టు 8, 2017న త్రిపుర కాంగ్రెస్ కీలక నేత సుదీప్ రాయ్ బర్మాన్ ను బీజేపీలోకి తీసుకురావడంలో విప్లవ్ కీలక పాత్ర పోషించారు. అగర్తలాలోని బనమాలిపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బిప్లవ్ కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ రాయ్ చేతిలో ఓడిపోయారు.
తాజా ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించడంలో విప్లవ్ కీలక పాత్ర పోషించారు. కాగా, తాజా ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఏడవ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను అమలు చేస్తామని హామి ఆయన ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనపై హామి ఇచ్చారు.