దొంగ నుంచి డాన్, దావూద్తో ఢీ: ఎవరీ చోటా రాజన్?
ఢిల్లీ: భారత్ గ్యాంగ్ స్టర్ చోటారాజన్ను ఆస్ట్రేలియా అధికారుల సహకారంతో ఇంటర్ పోల్ పోలీసులు అరెస్టు చేశారు. చోటా రాజన్ దశాబ్దాల తర్వాత ఇండోనేషియాలో దొరికాడు. అరెస్టును సిబిఐ నిర్ధారించింది. ఇతను దావూద్ ఇబ్రహీంకు మాజీ సన్నిహితుడు. రాజన్ భారత దేశంలో క్రైమ్ సిండికేట్ను నడుపుతున్నాడు.
ఇతను చిన్నపాటి దొంగతనాలు చేసే స్థాయి నుంచి భారత్ గ్యాంగ్ స్టర్గా ఎదిగాడు. ఒకప్పుడు అతను మామూలు దొంగ. ముంబైలో చిన్నచిన్న నేరాలు చేస్తూ అతడి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కొంతకాలంగా కుడిభుజంగా మెలిగాడు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో, దావూద్కు బద్ద శత్రువుగా మారాడు. మొదట చిన్న దొంగతనాలు చేశాడు. బడా రాజన్గా పేరొందిన రాజన్ నాయర్ గ్యాంగ్ తరఫున చోటా రాజన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాడు.
చోటా రాజన్ అసలు రాజేంద్ర సదాశివ నికాల్జే. ముంబైలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. అందరూ నానా అని ముద్దుగా పిలిచేవారు. బడా రాజన్ హత్యకు గురి కావడంతో ఆ గ్యాంగ్ పగ్గాలు చోటా రాజన్ చేతిలోకి తీసుకున్నాడు.
ఆ తర్వాత దావూద్ గ్యాంగ్లో చేరాడు. దావూద్తో శత్రుత్వం పెరగడంతో 1988లో భారత్ నుంచి దుబాయ్ పారిపోయాడు. బలవంతపు వసూళ్లు, హత్యలు, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల సరఫరా, సినిమాలకు ఫైనాన్సింగ్ వంటి నేరాలతో అతను ముంబైని, ప్రపంచ దేశాలను భయపెట్టాడు.
అతి పైన ఇరవై ఒక్కటికి పైగా హత్య కేసులు ఉన్నాయి. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్లతో దావూద్ - చోటా రాజన్ మధ్య విభేదాలు వచ్చాయి. అదే సమయంలో దావూద్ నేర సిండికేట్ అయిన డి కంపెనీని నిర్వహిస్తున్న సత్య, చోటా షకీల్, శారద షెట్టి... చోటా రాజన్కు వ్యతిరేకంగా దావూద్కు చెప్పారు.
దీంతో ఇద్దరి మధ్య వైరం పెరిగింది. రెండు గ్యాంగులు పరస్పరం తలపడేవి. మత కారణాలతో జరిగిన ముంబై పేలుళ్లను వ్యతిరేకించిన చోటా రాజన్.. దావూద్ నుంచి ముప్పు పొంచి ఉందనే కారణంతో తన మాకం ముంబై నుంచి మలేషియాకు, ఆ తర్వాత దుబాయ్ మార్చాడు. రెండు గ్యాంగులు పరస్పరం దాడులు చేసుకున్నాయి.
చోటా రాజన్ పైన దావూద్ ఇబ్రహీం 2000 సంవత్సరంలో హత్యాయత్నం చేయించాడు. బ్యాంకాకులోని ఓ హోటల్లో ఉన్న రాజన్ పైన దావూద్ అనుచరుడు చోటా షకీల్ దాడి చేశాడు. పిజ్జా డెలివరీ బాయ్గా వచ్చిన షకీల్ కాల్పుల్లో చోటా రాజన్ అనుచరులు రోహిత్ వర్మ, అతని భార్య చనిపోయారు.
చోటా రాజన్ మాత్రం తెలివిగా తప్పించుకొని హోటల్ అత్యవసర ధ్వారం నుంచి బయటపడ్డాడు. తర్వాత దాడికి ప్రతీకారంగా చోటా రాజన్ అనుచరులు 2001లో దావూద్ అనుచరులు వినోద్ షెట్టి, సునీల్ సోన్ల పైన దాడి చేసి చంపేశారు. దీంతో దావూద్ పట్టు సడలిపోయింది. చోటా రాజన్ భార్య పేరు అంకితా నికాల్జే. కూతుళ్లు నికిత, ఖుషీ ఉన్నారు.
ఇండోనేషియా, ఇంటర్పోల్కు ధన్యవాదాలు: రాజ్నాథ్ సింగ్
ఇండోనేషియా ప్రభుత్వం, ఇంటర్పోల్లకు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. డాన్ చోటా రాజన్ బాలిలో ఇంటర్పోల్కు పట్టుబడటంపై రాజ్నాథ్ స్పందించారు. చోటా రాజన్ను బాలిలో పోలీసులు అరెస్టు చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. చోటా రాజన్ 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు.