జాదవ్ కేసులో కీలకమైన హరీష్ సాల్వే వాదనలు, ఇంతకీ ఎవరీ సాల్వే, ఏమా కథ..
న్యూఢిల్లీ : కుల్భూషణ్ జాదవ్ స్పై ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే విధించింది. అంతర్జాతీయ కోర్టులో భారత్కు భారీ ఊరట కలిగింది. కేసును పున:సమీక్షించాలని, భారత్ వాదనలు వినిపించే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఇంటర్నేషనల్ కోర్టు తీర్పుకు కారణం.. అంతకుముందు భారత్ తరఫున బలంగా వాదనలు వినిపించిన హరీష్ సాల్వే. ఈ కేసే కాదు గతంలో కూడా చాలా కీలకమైన కేసుల్లో కూడా సాల్వే వాదించి, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఎవరీ సాల్వే, ఆయన నేపథ్యమెంటో.. తెలుసుకుందాం.
సాల్వే ఎంపికకు కారణమిదే ..
మాజీ నేవి అధికారి జాదవ్ బలూచిస్థాన్లో ఉగ్రవాద చర్యలు పాల్పడుతున్నారని పాకిస్థాన్ మిలిటరీ అరెస్ట్ చేసింది. ఉరిశిక్ష విధించడంతో భారత్ తీవ్రంగా ప్రతిఘటించింది. అంతర్జాతీయ కోర్టులో వాదనలు వినిపించింది. ఇందుకోసం ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేని ఎంపికచేసింది. సాల్వే రాజ్యాంగానికి సంబంధించి, కమర్షియల్ టాక్స్ లా గురించి మంచి పట్టుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైన క్రిమినల్ కేసులను కూడా వాదించారు. దాంతోనే 2017లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ .. అంతర్జాతీయ న్యాయస్థానంలో బలంగా తన వాదనలను వినిపించారు. సాల్వే వాదనలతో న్యాయమూర్తుల బృందం ఏకీభవించి .. తీర్పును పున:సమీక్షించాలని స్పష్టంచేసింది.
ఇదీ నేపథ్యం ..
1955 జూన్ 22న ఎన్కేపీ సాల్వే దంపతులకు మరాఠీ కుటుంబంలో జన్మించారు హరీష్ సాల్వే. ఆయన తండ్రి సీఏగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నేతగా గుర్తింపు పొందారు. హరీష్ తల్లి .. అంబ్రిత్.. వైద్యురాలు. హరీశ్ తాత కూడా క్రిమినల్ లాయర్గా పనిచేశారు. తండ్రి మీద ప్రభావంతో సీఏ చేశారు హరీశ్. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో న్యాయవాద ప్రొఫెషన్లో అడుగిడారు. వివిధ హైకోర్టుల్లో కేసులు వాదించారు. తర్వాత సుప్రీంకోర్టు కేసులు .. రాజ్యాంగ సంబంధ కేసులు, టాక్స్ కేసులు విచారంచి మంచి పేరుతెచ్చుకున్నారు. 1999 నుంచి 2002 వరకు సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. న్యాయవాద వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్న సాల్వే ..2017లో దేశంలో అత్యంత ప్రభావశీల 50 మంది వ్యక్తుల్లో సాల్వేకు ఇండియా టుడే 43 స్థానం కట్టబెట్టింది.
హిట్ అండ్ రన్ కేసు ..
2002లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కేసులో కూడా సాల్వే వాదనలు వినిపించారు. దాదాపు 13 ఏళ్ల పాటు కేసు విచారణ జరిగింద సాల్వే బలమైన వాదనలతో ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2017లో సాల్వేకు జాదవ్ కేసు విచారించమని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేసిన సాల్వే బలంగా వాదనలు వినిపించారు. తొలుత అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించి, ఉరిశిక్షను నిలిపివేయించారు. తర్వాత భారత్, పాకిస్థాన్ వాదనలు వినిపించాయి. ఈ కేసులో రెండేళ్ల పాటు వాదనల పర్వం కొనసాగాయిం. గూఢచర్యం, తీవ్రవాద కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ మిలిటరీకి విశేష అధికారాలు ఉన్నాయా అని అడిగారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి దశలో పాకిస్థాన్ వైఖరిని బలంగా ఎండగట్టారు. దీంతో కీలకమైన కేసులో భారత్కు అనుకూల తీర్పువచ్చింది.
ఫీజు.. రూపాయే...
కీలకమైన కేసులకు సంబంధించి న్యాయవాదుల ఫీజులు ఎక్కువగా ఉంటాయి. జాదవ్ కేసును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం సమర్థుడైన సాల్వేని ఎంపికచేసింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా సాల్వే .. ఈ కేసు వాదనల కోసం రూపాయి ఫీజు తీసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచారు. అదేంటి ఒక్క రూపాయా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. కానీ తాను తీసుకున్నా నామమాత్ర ఫీజుకు, దేశం కోసం బలంగా వాదించి .. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ వైఖరిని గట్టిగా ఎండగట్టారు. అందుకే ఇంటర్నేషనల్ కోర్టులో భారత్కు అనుకూలంగా తీర్పు వచ్చింది.