రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన సీఎం కోడలు: గుర్తు తెలియని వ్యక్తులతో టెన్షన్!
అర్థరాత్రి పూట ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో తమ కుటుంబం ఉలిక్కిపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్దారామయ్య కోడలు స్మితా రాకేష్ పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇమ ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు.
బెంగళూరులోని మల్లేశ్వరంలో కొడుకు ధ్యాన్, కూతురు తన్మయి, తల్లితో కలిసి ఉంటోంది స్మితా రాకేష్.కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు కొంతమంది తమ ఇంటి కాంపౌండ్ లోకి చొరబడ్డారని, పనసకాయలు దొంగతనం చేసి వెళ్లారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
అర్థరాత్రి పూట ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో తమ కుటుంబం ఉలిక్కిపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. గత జూన్15న అర్థరాత్రి 2గం.కు మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీనివల్ల తమకు ప్రశాంతత కరువైందని, తమకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. స్మితా రాకేష్ ఫిర్యాదు పట్ల స్పందించిన పోలీసులు.. ఆమె ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా, సిద్దారామయ్య పెద్ద కుమారుడు, స్మితా భర్త రాకేష్ గతేడాది బెల్జియంలో బ్రసెల్స్ ఆన్ట్వర్ప్ యూనివర్సటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 39సంవత్సరాల చిన్న వయసులోనే అతను కన్నుమూయడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.