రూ. 3 వేల కోట్ల చీటింగ్, మన్సూర్ ఖాన్ కోసం వేట, ఐఎంఎ ఆస్తులు రూ. 2 వేల కోట్లు, విదేశాల్లో!
బెంగళూరు: రూ. వేల కోట్ట డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి విదేశాలకు పారిపోయిన ఐఎంఎ జ్యువెలర్స్ ఎండీ మన్సూర్ ఖాన్ కార్లను ఎస్ఐటీ (సిట్) అధికారులు స్వాధీనం చేసుకుని అతని కోసం వేటాడుతున్నారు. బెంగళూరు నగరంలోని శివాజీనగర్ కు చెందిన కమర్షియల్ స్ట్రీట్ లోని ఐఎంఎ జ్యువెలర్స్ ముందు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐఎంఎ జ్యువెలర్స్ కు చెందిన అనేక మందిని ఇప్పటికే సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఐఎంఎ జ్యువెలర్స్ ఎండీ మన్సూర్ ఖాన్ విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నాడు అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఐఎంఎ జ్యువెలర్స్ సంస్థ భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసిందని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు నగరంతో సహా హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లోని ప్రజల దగ్గర భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేశారని వెలుగు చూసింది. మన్సూర్ ఖాన్ ఐఎంఎ సంస్థతో పాటు అనేక వ్యాపారాలు చేశాడని ఎస్ఐటీ అధికారుల విచారణలో బయటపడింది.
మన్సూర్ ఖాన్ విదేశాల నుంచి విడుదల చేసిన ఆడియో ప్రకారం ఐఎంఎ సంస్థకు రూ. 2, 000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయాని సమాచారం. తన ఆస్తులు విక్రయించి తనకు డిపాజిట్లు చెల్లించిన వారికి ఇవ్వాలని మన్సూర్ ఖాన్ అంటున్నారని సమాచారం.
ఐఎంఎ సంస్థలో నాసిర్ హుస్సేన్, నవీద్ అహమ్మద్ నట్టమ్ కర్, నిజాముద్దీన్ అజీముద్దిన్, అఫ్ఘాన్ తబుసమ్,అప్సర్ పాషా, అర్హాద్ ఖాన్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇప్పటికే ఐఎంఎకి చెందిన 7 మంది డైరెక్టర్లను సిట్ అధికారులు అరెస్టు చేశారు. తనను బెదిరించి కొందరు రాజకీయ నాయకులు దాదాపు రూ. 400 కోట్లు లంచం తీసుకున్నారని ఐఎంఎ యజమాని మన్సూర్ ఖాన్ ఆరోపిస్తున్నాడు. ఐఎంఎ సంస్థలో మొత్తం ముస్లీం సోదరులు డిపాజిట్లు చేసి మోసపోయారని సమాచారం.