కాంగ్రెస్ పార్టీకి రాజీనామా: ఎవరీ జయంతీ నటరాజన్?
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసి ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. అసలు ఇంతకీ ఎవరీ జయంతీ నటరాజన్ అనే ప్రశ్న అందరి మదిలో ఉంది.
నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహతంగా మెలిగిన జయంతీ నటరాజన్ మన్మోహాన్ సింగ్ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కేబినెట్లో పర్యావరణ శాఖమంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్ భక్తవత్సలం మనవరాలు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు జయంతీ నటరాజన్ చెన్నైలో లాయర్ వృత్తిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులను అధిరోహించారు.
1986లో దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ తొలిసారిగా జయంతీ నటరాజన్ను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేశారు. ఆ తర్వాత జరిగిన 1992, 1997, 2008లో జరిగిన లోక సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.
తమిళనాడు మహిళా కాంగ్రెస్లో సభ్యురాలిగా పనిచేసే సందర్భంలో ఐకే గుజ్రాల్ కేబినెట్లో పౌర విమానయాన శాఖ సహాయమంత్రిగా విధులు నిర్వహించారు. 2002లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు.
మహిళల హక్కుల కోసం పోరాడే వ్యక్తుల్లో జయంతీ నటరాజన్ ముందంజలో ఉంటారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పోందడానికి తన వంతుగా కృషి చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల జయంతీ నటరాజన్ డిసెంబర్ 2013న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, తన తాత కాంగ్రెస్ సీఎంగా పనిచేశారని గుర్తు చేశారు.
పార్టీలో తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను కాంగ్రెస్లో చేరినప్పుడు పరిస్ధితులు వేరు, ప్రస్తుతం ఉన్న పరిస్ధితులు వేరని వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవని విమర్శించారు.