మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? ఉద్దవ్ థాకరే వైపు మొగ్గు.. ఆదిత్య ఎందుకు వద్దంటే..?
మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? ఇప్పుడు ఈ ప్రశ్న సామాన్యుడిని తొలచివేస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీతో గవర్నర్ను కలువొచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం అనే కొశ్చన్ వస్తోంది.
తెరపైకి ఉద్దవ్ పేరు..?
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలు కనీస ఉమ్మడి ప్రణాళికను కూడా రూపొందించాయి. సీఎం పోస్టు కూడా శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ-కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. దీంతో మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై చర్చ జరుగుతుంది. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఉద్దవ్ కుమారుడు ఆదిత్య థాకరే పేరు వినిపించినా.. కూటమి మార్పు, సమీకరణాలు ఛేంజ్ అవడంతో సీఎం అభ్యర్థి కూడా మారిపోయాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బాల్థాకరే మాట..
వాస్తవానికి శివసేన ఎన్డీఏ తప్ప మిగతా పార్టీలతో కలిసి పోటీ చేయొద్దని, కలువొద్దని.. వ్యవస్థ అధ్యక్షులు బాల్ థాకరే స్పష్టంచేశారు. దీంతో తండ్రి విలువలకు ఉద్దవ్ తిలోదకాలు ఇచ్చారు. తమ వైరి పక్షాలు కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి చేతులు కలిపారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఉద్దవ్ మాత్రం అధికారమే పరమావధి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కుమారుడిని అందలం ఎక్కించాలనుకొన్నారు. కానీ పరిస్థితులు మారడంతో.. విధిలేని పరిస్థితుల్లో తాను సీఎం పీఠం అధిష్టించాల్సి వస్తోంది.
శివసేన అభ్యర్థికే..
శివసేన కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో సేన అభ్యర్థి ఐదేళ్లు సీఎం పదవీలో కొనసాగుతారు. కాంగ్రెస్, ఎన్సీపీ చెరో డిప్యూటీ సీఎం పదవీ కట్టబెడతారు. ఇక పోర్టుపోలియాలకు సంబంధించి మూడు పార్టీలు సమానంగా పంచుకుంటాయి. దీంతో సీఎం ఎవరనే చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ మాత్రం ఆదిత్య థాకరే డిప్యూటీ సీఎం పదవే ఎక్కువ.. కానీ అతనికి సీఎం పదవీ ఆశ చూపుతున్నారని విమర్శించారు.
ఆదిత్యకు నో
కాంగ్రెస్, ఎన్సీపీ కూడా ఆదిత్య థాకరేను సీఎం అభ్యర్థిగా అంగీకరించబోమని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో శివసేనలో సీఎం అభ్యర్థి కోసం అన్వేషించాల్సి వచ్చింది. దీంతో తెరపైకి ఉద్దవ్ పేరు వినిపిస్తోంది. వాస్తవానికి బాల్ థాకరే, ఉద్దవ్ థాకరే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆదిత్య పోటీ చేసి.. సీఎం పదవీ అదిష్టిస్తానని సంకేతాలు ఇచ్చారు. కానీ బీజేపీతో బెడిసికొట్టడం.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలుపాల్పి రావడంతో శివసేనకు ఉద్దవ్ తప్ప మరో మార్గం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు.