చోరీలు చేసి సినిమాలు నిర్మాణం.. ఇదీ చెన్నై నగల దొంగ మురుగన్ జీవితం
అతనికి సినిమాలంటే పిచ్చి, ఏకంగా సినిమాలు తీయాలనుకున్నారు. కానీ అందుకోసం చేతివాటం ప్రదర్శించాడు. అవును దొంగతనం చేశాడు. ఏకంగా బ్యాంకులు, నగల దుకాణాల మీద పడ్డాడు. రూ.కోట్లు దోచుకొని ఏకంగా తెలుగులో ఓ సినిమా కూడా నిర్మించాడు. కానీ చేసిన పాపం ఎక్కడికి పోతుంది.. పోలీసులు పట్టుకోవడంతో సినిమా ఆగిపోయింది. మళ్లీ విడుదలై.. మరో సినిమా తీశాడు. కానీ అదీ కూడా ఆటకెక్కింది. ఇదీ చెన్నై నగల దొంగ మురుగన్ జీవిత చరిత్ర.
చదువు లేదు.. కానీ
అతనికి చదువుకోలేదు, కానీ లోకజ్ఞానం మాత్రం మెండు. ప్రణాళిక వేశాడంటే చాలు ఎంత పెద్ద బ్యాంకు అయినా, జ్యువెల్లరీ షాపు అయినా కొల్లగొట్టాల్సిందే. అతనే మురుగన్. తమిళనాడులోని తిరువారూర్కు చెందిన మురుగన్ అలియాస్ బాలమురుగన్ చేయి తిరిగిన దొంగ. గోడలకు కన్నాలు వేయడంలో నేర్పరి. కోటిశ్వరుడు కావాలనే లక్ష్యంతో అడ్డదారుల్లో దొంగతనాలు చేస్తున్నాడు.
కాదేది చోరీకి అనర్హం
బ్యాంకులు, ఏటీఎం, జ్యువెల్లరీ షాపు దేనిని మురుగన్ వదలలేదు. తమిళనాడే కాదు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే తన ఇంట్లో టేప్ రికార్డర్ ఎలా దొంగతనం చేయాలని ఆలోచించాడని పోలీసులు చెప్తున్నారు. ఇక్క అప్పటినుంచి దొంగతనాలు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాడు. 2008లో ముఠాను కూడా ఏర్పాటు చేశాడు. బెంగళూరులో చోరీ చేయగా ..2011లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్పై విడుదలై హైదరాబాద్కు షిప్ట్ అయ్యాడు.
హైదరాబాద్లో ఇల్లు
భాగ్యనగరంలో ఇల్లు కొన్నాడు. సినిమాలంటే ఇష్టపడే మురుగున్ సొంతంగా సినిమా తీయాలనుకొన్నాడు. రూ.50 లక్షలతో బాలమురుగున్ ప్రొడక్షన్ పేరుతో సినీ నిర్మాణం కంపెనీ ప్రారంభించాడు. తెలుగులో మనసా వినవే సినిమాను నిర్మించాడు. ఆ సినిమాలో తన అల్లుడు సురేశ్ను హీరో చేశాడు. సినిమా 70 శాతం పూర్తయ్యాక చోరీ కేసులో చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సినిమా అక్కడికే ఆగిపోయింది. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మారలేదు ఆత్మ అనే మరో సినిమా ప్రారంభించాడు. కానీ అదీ కూడా ఆటకెక్కింది. తాజాగా లలిత జ్యువెల్లరీలో చోరీ చేసి మరోసారి వెలుగులోకి వచ్చాడు.
ఇదీ నేపథ్యం
2014లో చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్యంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.2 కోట్లకు పైగా నగదు, నగలను మురుగన్ చోరీచేశాడు. 2014లో ఘట్ కేసర్ వద్ద గల గ్రామీణ బ్యాంకులో రూ.35 లక్షలు దోచుకున్నాడు. 2015లో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో కూడా తన చేతివాటం ప్రదర్శించాడు. 2017లో చెన్నై అన్నానగర్, తిరుమంగళంలో 17 ఇళ్లలో చోరీలు చేసి హల్ చల్ చేశాడు.
5 కిలోల బంగారం
మురుగన్ ముఠా నుంచి 5 కిలోల బంగారాన్ని గ్రేటర్ చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. లలితా జ్యువెల్లరీలో భారీగా బంగారు ఆభరణాలు చోరీ చేసి, మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని పోలీసులు చెప్తున్నారు. వ్యాన్లో తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడని.. తిరువారూర్కు వచ్చినప్పుడుల్లా అక్కడివారికి ఆర్థికసాయం చేస్తారని పోలీసులు తెలిపారు. దీంతో వారు తమకు మురుగన్ నుంచి సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు.