కొత్త సీబీఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా ఎవరు.. కాంగ్రెస్ ఎవరు ఉండాలని కోరుకుంది..?
ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టరుగా నియమితులయ్యారు 1983 ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా. ఈయన నియామకాన్ని ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినప్పటికీ... ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలెక్ట్ ప్యానెల్ మాత్రం రిషికుమార్ వైపే మొగ్గు చూపడం విశేషం. ఈ అత్యున్నత పోస్టుకు ఇకపై కొత్త బాస్గా వ్యవహరించనున్న రిషికుమార్ శుక్లా ఎవరు ఆయన నేపథ్యం ఏమిటి ఒక్కసారి చూద్దాం...
రిషికుమార్ శుక్లా... 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మధ్యప్రదేశ్కు 28వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీగా ఆయన సేవలందించారు. 2016 జూలైలో ఆయన డీజీపీగా రిషికుమార్ నియామకం జరిగింది. ఆ తర్వాత 2017లో ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో సెలవుపై వెళ్లారు. అనంతరం ఆయన్ను మధ్యప్రదేశ్ పోలీసు హౌజింగ్ బోర్డు ఛైర్మెన్గా నియమించింది. అనంతరం సెలవు నుంచి తిరిగి వచ్చాక డీజీపీగా 2018 బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్ డీజీపీగా సేవలందించకముందు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.
గ్వాలియర్కు చెందిన రిషికుమార్ శుక్లా.. తన తొలి పోస్టింగు రాయ్పూర్లో ఇవ్వడం జరిగింది. ఛీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత దమోహ, శివ్పురి, మందసౌర్ ఎస్పీగా వ్యవహరించారు. 2009 నుంచి 2012 వరకు ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీగా కూడా రిషికుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. మధ్య ప్రదేశ్లోనే ప్రాథమిక విద్య తర్వాత శుక్లా కోల్కతాకు వెళ్లారు. అక్కడే తన ఉన్నత విద్యను అభ్యసించారు. ఐఐటీలో చదువునుపూర్తి చేసిన శుక్లా... ఐపీఎస్కు సన్నద్ధం అయ్యారు.