వార్తల్లో వ్యక్తి: ఎవరీ సాధ్వీ నిరంజన్ జ్యోతి?
న్యూఢిల్లీ: సాధ్వీ నిరంజన్ జ్యోతి అంటే మంగళవారం ఉదయం వరకు చాలా మందికి తెలియదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సోమవారం చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమె చేసిన హేట్ స్పీచ్పై తీవ్ర దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళనకు దిగాయి. ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించలేదు. ఆమె రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. అంత వివాదానికి కారణమైన సాధ్వీ నిరంజన్ జ్యోతి ఎవరనే ఆసక్తి నెలకొనడం సహజం.
గత నెలలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నిక కావడంతో ఆమె వార్తల్లోకి ఎక్కారు. తొలిసారి ఆమె పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తనపై సమాజ్వాదీ కార్యకర్తలు ఓ కార్యక్రమంలో దాడి చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. తనను చంపడానికి ప్రయత్నించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాషాయ వస్త్రాలు ధరించే 47 ఏళ్ల జ్యోి కథా వాచక్గా పనిచేసే సన్యాసిని. మతపరమైన ఉత్సవాల్లో కథా ప్రవచనాలు చేసేవారు. పార్లమెంటు బయోడేటాలో మాత్రం ఆమె సామాజిక కార్యకర్తగా పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా ఆమెకు పెద్దగా అనుభవం లేదు. అయితే, బిజెపిలో, విశ్వవిహిందూ పరిషత్లో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వివిధ హోదాల్లో పనిచేశారు
మొదటిసారి ఆమె ఎన్నికల్లో 2012లో గెలిచారు. ఆమె ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఈసారి ఆమెను లోకసభకు పోటీకి దించడంతో బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దళిత, వెనకబడిన వర్గాల్లోకి చొచ్చుకుపోగలగింది. లోకసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి అనూహ్యమైన స్థానాలు లభించాయి. దాంతో 2017లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.
జ్యోతి బోట్మెన్ వర్గానికి చెందినవారు. ఈ వర్గం వోటు బ్యాంక్ ఉత్తరప్రదేశ్లో చాలా పెద్దది. నవంబర్లో జరిగిన విస్తరణలో ఆమె కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ శాఖను నిర్వహిస్తున్నారు. విస్తరణలో మోడీ 21 మందికి స్థానం కల్పించగా జ్యోతి మాత్రమే మహిళ. పార్లమెంటు ప్రొఫైల్లో ఆమె ఇంటర్మీడియట్ చదివినట్లుగా ఉంది.
జ్యోతి సృష్టించిన వివాదం ఇప్పట్లో సద్దుమణుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ప్రతిపక్షాలు క్షమాపణలతో సరిపెట్టుకోకపోవడంతో వివాదం ముదిరేట్లు కనిపిస్తోంది.