ఎవరీ సుభాష్ బతామ్, ఎందుకు చిన్నారులను తీసుకెళ్లాడు, కారణమెంటో తెలుసా..?
ఫరూఖాబాద్లో చిన్నారులను నిర్బంధించిన సుభాష్ బథామ్ ఎవరు.. ఆయన చిన్నారులను ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లారనే అంశం చర్చానీయాంశమైంది. చిన్నారులను తీసుకెళ్లి బంధించేందుకు అధికారులే కారణమనే వాదన వినిపిస్తోంది. మరికొందరు అతనికి మతిస్థిమితం లేదని చెబుతున్నారు. ఇందులో నిజ నిజాలేంటీ..?
ఇవీ సమస్యలు..
సుభాష్ బథామ్ తన భార్యతో కలిసి ఉంటున్నారు. అయితే వారి అద్దెకుంటున్న ఇంటిలో టాయిలెట్ సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వ నివాస గృహం ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిని కలెక్టర్ తిరస్కరించింది. దీంతో ప్రభుత్వంపై కోపంతో చర్యలకు దిగాలనే ఆలోచనకు వచ్చినట్టున్నారు.
ఇల్లు ఇవ్వలేదు.. టాయిలెట్ లేదు
సుభాష్ బథామ్తో భార్య, తల్లి ఉంటున్నారు. వారికి మెరుగైన జీవనం కల్పించేందుకు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. సుభాష్ రోజువారీ కూలీగా పనిచేసేవాడు. దీంతో అతనికి వచ్చే నాలుగురాళ్లతో పొట్టపోసుకోవడానికి సరిపోయేది. ప్రభుత్వ నివాస గృహం ఇవ్వకపోయినా.. కనీసం తన ఉంటోన్న ఇంట్లో టాయిలెట్ నిర్మించాలని కూడా కలెక్టర్కు వేడుకొన్నాడు. అయినా వినిపించుకోలేదు. ఇంకేముంది క్రిమినల్గా మారి చిన్నారులను బంధించి హల్చల్ చేశాడు.
మతి లేదు.. హత్య కేసు
అయితే పోలీసులు మాత్రం సుభాష్ బథామ్కు మతిస్థిమితం లేదని చెప్తున్నారు. అతను ఇదివరకు ఒక హత్యకేసులో నిందితుడి అని పేర్కొన్నారు. తర్వాత మతిపోవడంతో తన ఇంట్లో బర్త్ డే పార్టీ ఉందని మభ్యపెట్టి చిన్నారులను తీసుకెళ్లడానికి పేర్కొన్నారు. వారిని ఇంటి బేస్మెంట్లో ఉంచి.. ఆరు రౌండ్ల కాల్పులు కూడా జరిపారని పేర్కొన్నారు. తమ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుతానని చెప్పడంతో.. ఎమ్మెల్యేను పిలిపించామని.. కానీ చివరికి ఆయనతో కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. మతిస్థిమితం లేకపోవడంతోనే సుభాష్ పిల్లలను బంధించారని వివరించారు. క్రిమినల్ సుభాష్ బతామ్ను మట్టుబెట్టిన పోలీసు బృందానికి యూపీ సీఎం అవార్డు ప్రకటించారు. రూ.10 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు.
నో లైవ్ ప్లీజ్..
చిన్నారులను నిర్బంధించిన తర్వాత సుభాష్తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. డిమాండ్లు ఏమిటో చెప్పాలని కూడా అడిగారు. అయితే హోంశాఖ ఉన్నతాధికరి ఒకరు రెస్క్యూ ఆపరేషన్ లైవ్ ప్రసారం చేయొద్దని టీవీ చానెళ్ల యాజమానులకు స్పష్టంచేశారు.
సుభాష్ భార్యపై దాడి
ఎన్కౌంటర్ తర్వాత బయటకొచ్చిన అతని భార్యపై స్థానికులు దాడి చేశారు. స్థానికుల దాడిలో గాయపడ్డ ఆమెను చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్రిమినల్ సుభాష్ చెరలో ఉన్న చిన్నారులు అంతా ఐదు నుంచి తొమ్మిదేళ్ల వయస్సు ఉన్నవారే కావడం గమనార్హం.