లోకాయుక్త జడ్జి నవ్వినందుకు మూడుసార్లు పోడిచాడు, గతంలో 18 కేసులు, ఎవరు ఈ వ్యక్తి!
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టిని హత్య చెయ్యడానికే తేజస్ శర్మా అలియాస్ తేజ్ రాజ్ శర్మా వచ్చినట్లు ఉందని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశానని సీఎం సిద్దరామయ్య అన్నారు. లోకాయుక్త న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద కత్తితో దాడి చేసిన సమయంలో గన్ మ్యాన్ బయట ఉన్నాడని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. అయితే లోకాయుక్త జడ్జి నవ్వినందుకే నిందితుడు మూడుసార్లు కత్తితో పోడిచాడని వెలుగు చూసింది.
తేజ్ రాజ్ శర్మా ఎవరు ?
తముకూరు జిల్లా తిపటూరుకు చెందిన తేజ్ రాజ్ శర్మాకు ఓ ఫర్నీచర్ షోరూం ఉంది. ఇతను కర్ణాటక ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నీచర్ సరఫరా చేస్తుంటాడు. ఆ సందర్బంలో తన దగ్గర లంచం తీసుకుంటున్న అధికారుల మీద ఇప్పటికే తేజ్ రాజ్ శర్మా లోకాయుక్తులో 18 కేసులు వేశాడు.
కేసు విచారణ
బుధవారం ఓ కేసు విచారణ నిమిత్తం తేజ్ రాజ్ శర్మా లోకాయుక్త కార్యాలయానికి వెళ్లాడు. తరువాత ఎఆర్ ఇ లక్ష్మీని కలిశాడు. కేసు విచారణకు సంబంధంచిన సమాచారం చెప్పాలని తేజ్ రాజ్ శర్మా అడిగాడు. అయితే ఎఆర్ ఇ లక్ష్మి ఇచ్చి సమాధానంతో తేజ్ రాజ్ శర్మా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వచ్చాడు.
న్యాయమూర్తి చాంబర్
ఎఆర్ ఇ లక్ష్మితో మాట్లాడి బయటకు వచ్చిన తేజ్ రాజ్ శర్మా నేరుగా న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి చాంబర్ లోకి వెళ్లాడు. అప్పుడే భోజనం చెయ్యడానికి కుర్చుంటున్న న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టిని కేసు విషయం గురించి తేజ్ రాజ్ శర్మా అడిగాడు.
న్యాయమూర్తి నవ్వారని
తేజ్ రాజ్ శర్మా అడిగిన ప్రశ్నకు న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తాను సమాధానం చెప్పమంటే జడ్జి విశ్వనాథ్ శెట్టి నవ్వుతున్నారని రెచ్చిపోయిన తేజ్ రాజ్ శర్మా వెంటనే కత్తి బయటకు తీసి మూడు సార్లు పోడిచి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.
18 కేసులు విచారణ
కర్ణాటక ప్రభుత్వంలోని అవినీతి అధికారుల మీద 18 కేసులు వేసిన తేజ్ రాజ్ శర్మా ప్రతి కేసు విచారణకు హాజరవుతున్నాడు. అయితే సరైన సాక్షాలు సమర్పించలేదని ఇప్పటికే ఓ కేసు కొట్టి వేశారు. న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టికి స్కానింగ్ పూర్తి చేసి శాస్త్ర చికిత్స చేస్తున్నారు.