CCD Owner's Death: ఎవరా ఐటీ డీజీ? మైండ్ ట్రీలోని సిద్ధార్థ షేర్లు మాత్రమే అటాచ్ ఎందుకు?
బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపక ఛైర్మన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య ఉదంతం అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. ఆదాయపు పన్ను అధికారులు, కొన్ని ప్రైవేటు సంస్థల మధ్య ఉన్న సంబంధాలను వెలికి తీస్తోంది. అధికార పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టడానికి ఆదాయపు పన్ను, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలను ప్రయోగిస్తోందనడానికి ఉదాహరణగా నిలిచింది. వీజీ సిద్ధార్థ రాసినట్టుగా భావిస్తోన్న లేఖలో పొందుపరిచిన ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్, మైండ్ ట్రీ అనే రెండు పదాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరతీశాయి.
కాఫీ డే సిద్దార్థ బీజేపీ ఐటీ దాడులకు బలి అయ్యారా?: ఎస్ఎం కృష్ణ పార్టీ ఫిరాయింపు అల్లుడి కోసమేనా?
సిద్ధార్థకు మైండ్ ట్రీ సంస్థలో 20 శాతం షేర్లు
వీజీ సిద్ధార్థకు మైండ్ ట్రీ సాఫ్ట్ వేర్ సంస్థలో 20.5 శాతం మేర షేర్లు ఉన్నాయి. దశలవారీగా ఆయన మైండ్ ట్రీ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. తన కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడంలో భాగంగా సిద్ధార్థ.. మైండ్ ట్రీలో 20.5 మేర పెట్టుబడులను పెట్టారు. ఆ సంస్థకు చెందిన షేర్లను కొనుగోలు చేశారు. 1999లో మైండ్ ట్రీ సంస్థ ఏర్పాటైన తొలి రోజుల్లోనే సిద్ధార్థ అందులో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. 44 కోట్ల రూపాయలను ఆయన ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు. మొత్తం పెట్టుబడిలో ఆయన వాటా 6.6 శాతం. 2011లో మరో 5.57 శాతం పెట్టుబడులు పెట్టారు. దీని విలువ 85 కోట్ల రూపాయలు.
లాభాలన్నీ మైండ్ ట్రీలో..
అదే ఏడాది కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల నిర్వహణ వల్ల లాభాలు వచ్చాయి. లాభంగా వచ్చిన మొత్తంలో 40 కోట్ల రూపాయలను కూడా అదే ఏడాది మైండ్ ట్రీలో పెట్టుబడి పెట్టారు. 2012లో సైతం ఆయన పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఆ ఏడాది వీజీ సిద్ధార్థ.. ఏకంగా 171 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. దీనితో మైండ్ ట్రీ సంస్థలో వీజీ సిద్ధార్థ పెట్టిన పెట్టుబడుల మొత్తం 20.05 శాతానికి చేరుకున్నాయి. వాటి విలువ సుమారు 3000 కోట్ల రూపాయలుగా తేలింది. క్రమంగా ఆయన ఆ షేర్లను ఎల్ అండ్ టీకి విక్రయించారని చెబుతున్నారు. ఈ విక్రయం వల్ల సిద్ధార్థ 3000 కోట్ల రూపాయల లాభాలను చవి చూశారని, వాటిని కూాడా మైండ్ ట్రీలోకి పెట్టుబడుల రూపంలో బదలాయించారని అంటున్నారు. సరిగ్గా ఇదే మొత్తాన్ని తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు అటాచ్ చేశారనే విమర్శలు ఉన్నాయి.
వాటిని అటాచ్ చేసినట్లు ఆరోపణలు..
మైండ్ ట్రీ సాఫ్ట్ వేర్ సంస్థలో వీజీ సిద్ధార్థ పెట్టిన పెట్టుబడులు మాత్రమే అటాచ్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు గానీ, నోటీసులు గానీ ఇవ్వకుండా, హుటాహుటిన సిద్ధార్థకు చెందిన షేర్లను అటాచ్ చేశారని అంటున్నారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ ఒకరు ఆయనను వేధింపులకు గురి చేసి ఉండొచ్చని అంటున్నారు. ఇదే విషయాన్ని సిద్ధార్థ సైతం ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో- సిద్ధార్థను వేధింపులకు గురి చేసిన ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఎవరై ఉంటారనే అంశంపై చర్చ సాగుతోంది. సిద్ధార్థ రాసినట్లుగా చెబుతున్న లేఖలో సంతకం తేడా కొడుతోందని అంటూ కర్ణాటక ఆదాయపు పన్ను శాఖ డీజీ బాలకృష్ణన్ వెల్లడించిన విషయం తెలిసిందే.