కోష్యారీకి మహా ఎఫెక్ట్: బదిలీ కోరారా..బ(లి)దిలీ చేస్తున్నారా..?
మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ను కేంద్రం తొలగించనుందా..? ఆయన స్థానంలో మరో గవర్నర్ను నియమించనుందా.. అంటే హస్తినలో ఔననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన తర్వాత కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్రం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న భగత్ సింగ్ కోష్యారీని బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి కోష్యారీ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్గా ఎవరు రానున్నారు..? కేంద్రం మదిలో ఎవరున్నారు..?
గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి బదిలీకి రంగం సిద్ధం..?
మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ రాజీనామా చేయడం ఆ వెంటనే దేవేందర్ ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి. ఇక కేంద్రం తమపై నింద రాకుండా జాగ్రత్తగా పావులు కదిపేందుకు తయారైంది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని బదిలీ చేసేందుకు సిద్ధమైంది. ఆయన స్థానంలో రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా పేరును ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
గవర్నర్ పాత్రను తప్పుబట్టిన కాంగ్రెస్
ఇక మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కీలకంగా వ్యవహరించారు. అప్పటికప్పుడు రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని సూచించడం, ఫడ్నవీస్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అన్నీ ఒక్క రాత్రిలో జరిగిపోయాయంటే భగత్ సింగ్ కోష్యారీ పాత్ర ఎంతో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు దీన్నే కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మహారాష్ట్ర ఎపిసోడ్లో సత్యం గెలిచింది అనేది ప్రశ్న కాదని గవర్నర్ వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చెప్పారు. రాజ్యాంగ ఉల్లంఘన, నియమనిబంధనలు, సంప్రదాయాలు అన్నీ గాలికొదిలేసి గవర్నర్ ఒక పార్టీ వ్యక్తిలా వ్యవహరించారని మనీష్ తివారీ మండిపడ్డారు. ఇప్పుడు దీనిపైనే సుప్రీంకోర్టు ఆలోచిస్తుందని తమ పార్టీ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
గవర్నర్ను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్
ఇక సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ గవర్నర్ వ్యవహారంపై ప్రశ్నించారు. తను తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది కాదని ధర్మాసనంకు తెలిపారు. అంతేకాదు గవర్నర్ వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి వెంటనే భగత్ సింగ్ కోష్యారీని తొలగించి మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
నేను కోరితేనే గవర్నర్ ఆహ్వానించారు: దేవేంద్ర ఫడ్నవీస్
ఇక మహారాష్ట్ర ఎపిసోడ్ను ప్రధాని మోడీ-అమిత్ షాలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ద్వారా నడిపించారని ఆరోపణలు వచ్చాయి. ఇక వీటికి తెరదించుతూ దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరితేనే గవర్నర్ ఆహ్వానించారని ఆమేరకే రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని రికమెండ్ చేశారని చెప్పుకొచ్చారు. ఇందులో ప్రధాని మోడీ-అమిత్షా గవర్నర్ కోష్యారీ పాత్రలు లేవని స్పష్టం చేశారు. అయితే తొందరపాటు చర్యతో బీజేపీ ఫడ్నవీస్ను బలిపశువును చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కోష్యారిని కూడా బదిలీ చేసే అవకాశాలున్నట్లు ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోకముందే ఈ తంతును పూర్తిచేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త గవర్నర్గా కల్రాజ్ మిశ్రా..?
ఇదిలా ఉంటే మహారాష్ట్ర గవర్నర్గా రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాను నియమించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాజస్థాన్ గవర్నర్గా కల్రాజ్ మిశ్రా సెప్టెంబర్ 9న బాధ్యతలు స్వీకరించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఆయన్ను రాజస్థాన్ గవర్నర్గా బదిలీ చేసింది కేంద్రం. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కల్రాజ్ మిశ్రా గవర్నర్ పదవి కంటే ముందు కేంద్రమంత్రిగా, యూపీ బీజేపీ చీఫ్గా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కోష్యారీ పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు.
మొత్తానికి బీజేపీ తొందరపాటు చర్యతో ఆ పార్టీకి నష్టం చేకూరిందని అదే సమయంలో వ్యక్తిగతంగా ఫడ్నవీస్కు భంగపాటు కలిగిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.