నా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోందీ సిగ్గులేని కాంగ్రెస్: మోడీ నిప్పులు
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న విమర్శలకు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందిస్తున్నారు. తనను నీచమైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డారు.
కాగా, తాజాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కీలక అనుచరుడైన సల్మాన్ నిజామీ చేసిన వ్యాఖ్యలపైనా మోడీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సల్మాన్... తన తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తున్నారని, అసలు అలాంటి భాష ఉపయోగించవచ్చా? అని మోడీ ప్రశ్నించారు.
'నా తండ్రి, తల్లి ఎవరని కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రశ్నిస్తోంది. నా సోదరీసోదరులారా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను.. అలాంటి భాషను మనం శత్రువుల విషయంలోనైనా ఉపయోగిస్తామా? కానీ, ఒక బాధ్యతగల కాంగ్రెస్ పార్టీ నేత నన్ను ఇలా అడిగారు' అని మోడీ ధ్వజమెత్తారు.
'రాహుల్గాంధీ పార్టీ నా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోంది. ఈ దేశ ప్రజలే నా తల్లిదండ్రులు. నేను ఈ భూమిపుత్రుడిని.. ఈ లునావాడ బిడ్డను. భాష విషయంలో, పనుల విషయంలో మాటల విషయంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గును వదిలేసింది. ఆ పార్టీ ఓటమి అంచుల్లో ఉంది. ఎన్నో అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అలా అబద్ధాలు చెప్పడం కూడా నేరమే. సామాన్య ప్రజలకోసం పనిచేసేది మన ప్రభుత్వమే' అని స్పష్టం చేశారు.