రోహిత్: స్మృతిXమాయా, 'అఫ్జల్ ఉగ్రవాదా కాదా సోనియా చెప్పాలి'
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అంశంపై రాజ్యసభలో బుధవారం నాడు దుమారం చెలరేగింది. ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే బీఎస్పీ నేత మాయావతి... రోహిత్ మృతి అంశాన్ని లేవనెత్తారు.
హెచ్సియులో దళిత విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. హెచ్సియు ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు బృందంలో దళిత సభ్యులే ఉండాలన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
దళిత విద్యార్థి ఆత్మహత్యకు ఇదే తొలిసారి కాదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ భావజాల వ్యాప్తికి కుట్ర జరుగుతోందన్నారు. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ... రోహిత్ అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్నారన్నారు. రోహిత్ ఆత్మహత్యతో బిజెపికి, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.
ఇదే అంశంపై చర్చ సమయంలో మాట్లాడాలని డిప్యూట్ ఛైర్మన్ వారించినా మాయావతి శాంతించలేదు. మాయావతికి మాట్లాడే అవకాశమివ్వాలని కోరుతూ బీఎస్పీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఓ సమయంలో ప్రతిపక్షాలు.. బిజెపికి, ఆరెస్సెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో డిప్యూటీ ఛైర్మన్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం రేపటికి వాయిదా పడింది. అంతకుముందు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... రోహిత్ మృతి పైన నిష్పక్ష పాత విచారణ జరగాలన్నారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేశారని అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.
రోహిత్ ఆత్మహత్యలో కేంద్రమంత్రుల ప్రమేయం: జ్యోతిరాదిత్య
కొద్దిరోజులుగా దేశంలో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని లోకసభలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సిందియా అన్నారు. రోహిత్ ఆత్మహత్యలో కేంద్రమంత్రుల ప్రమేయం ఉందని చెప్పారు. రోహిత్ దళితుడు కాదన్న అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేశారని చెప్పారు. దేశంలో జరుగుతున్న అసహనానికి మనమే ప్రత్యక్ష సాక్షులం అన్నారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్లో రోహిత్ అంశంపై మాట్లాడలేదన్నారు.
ఉగ్రవాదులను ఎలా కీర్తిస్తారు
జెఎన్యు, హెచ్సియు ఘటన పైన బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ లోకసభలో విపక్షాలపై మండిపడ్డారు. ఉగ్రవాదులను ఎలా కీర్తిస్తారని ప్రశ్నించారు. దేవాలయం వంటి పార్లమెంటు పైన దాడి చేసిన అఫ్జల్ గురును ఎలా కీర్తిస్తారన్నారు. ఇంటింటికో అఫ్జల్ గురు పుట్టుకు వస్తారని ఎలా అంటారన్నారు. అఫ్జల్ గురు ఉగ్రవాదా కాదా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పాలన్నారు.