రజనీ, కమల్ నాశనం చెయ్యడానికి వస్తున్నారా, పళని ప్రభుత్వం కూలిపోతుంది: స్టాలిన్!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ శాసన సభ్యుల అనర్హత వేటు కేసులో మద్రాసు హైకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ జ్యోష్యం చెప్పారు. ద్రవిడ ఉద్యమాన్ని నాశనం చెయ్యడానికి రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? అంటూ స్టాలిన్ పరోక్షంగా ప్రశ్నించారు.
అడ్రస్ లేకుండా పోయారు
తమిళనాడు రాష్ట్రంలో ద్రావిడ ఉద్యమాన్ని, సిద్ధాంతాలను నాశనం చేస్తామంటూ ఇప్పుడు పలువురు బయలుదేరారని, కొత్త నాయకులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారని, అయితే ఇప్పటి వరకు ద్రావిడ ఉద్యమాన్ని అణచివేయాలని భావించిన వారందరూ అడ్రస్ లేకుండా పోయారని స్టాలిన్ చెప్పారు.
Recommended Video
రజనీ, కమల్ పై కామెంట్
కొత్తగా రాజకీయాల్లో రావాలనుకుంటున్న వారు ప్రజలకు ఏం చేస్తారో ముందుగా చెప్పి వస్తే మంచిదని, ప్రజలు అర్థం చేసుకుని ఓట్లు వెయ్యడానికి అవకాశం ఉంటుందని రాజకీయల్లోకి వచ్చేందుకు సిద్దం అయిన సినీ నటులు సూపర్ స్టార్ రజనీకాంత్, బహుబాషనటుడు కమల్హాసన్ లను ఉద్దేశించి స్టాలిన్ పరోక్షంగా విమర్శించారు.
పెళ్లికి వెళ్లి విసుర్లు
పెరంబూరు రైల్వే కల్యాణమండపంలో జరిగిన డీఎంకే నేత చంద్రశేఖర్ ఇంటి వివాహవేడుకకు ఎంకే. స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంకే. స్టాలిన్ తమిళనాడు ప్రభుత్వం, రాజకీయాల్లోకి వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్, బహుబాష నటుడు కమల్ హాసన్ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
కేంద్రం దగ్గర తాకట్టు
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం పాలనాధికారాలను కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టుపెట్టేసిందని ఎంకే. స్టాలిన్ విమర్శించారు. ఇప్పటికే శాసనసభలో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి మెజారిటీ లేదని, సిగ్గులేకుండా అధికారంలో ఉన్నారని ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
ఆరోజు చూడండి
అన్నాడీఎంకే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది శాసన సభ్యుల అనర్హత వేటు కేసుపై మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజు ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం పతనమవుతుందని ఎంకే. స్టాలిన్ జోస్యం చెప్పారు.
మాదే అధికారం
ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయిన తరువాత జరిగే శాసన సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని, తరువాత ప్రజలకు అంతా మంచే జరుగుతోందని ఎంకే. స్టాలిన్ అన్నారు.
అన్నాదురై ఆదర్శం
డీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై ఆదర్శ వివాహాలను ప్రోత్సహించి, వాటికి చట్టపరమైన గుర్తింపును కలిగించారని, ప్రస్తుతం కరుణానిధి, తన హయాంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదర్శ వివాహాలను చేసుకుంటున్నారని ఎంకే. స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు.