యూపీ బీజేపీకి కీలకం: ఎన్నో కారణాలు, సీఎం రేసులో వీరే..
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. మిగతా వాటి కంటే యూపీ పైనే బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
లక్నో: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగతా వాటి కంటే యూపీ పైనే బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ములాయం సింగ్కు కొడుకు 'కారు' చిక్కులు, వీడియో వైరల్
తండ్రీ - కొడుకులు ములాయం సింగ్ యాదవ్ - అఖిలేష్ యాదవ్ మధ్య సంఘర్షణ బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎస్పీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇక వారు కలిసినా, విడిపోయినా పెద్ద తేడా ఉండదని అంటున్నారు. బీఎస్పీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, దాదాపు బీజేపీ గెలుపు ఖాయమైందని అంటున్నారు.
లోకసభ ఎఫెక్ట్
మిగతా నాలుగు రాష్ట్రాలు చిన్నవి. యూపీ చాలా పెద్ద రాష్ట్రం. అందరి దృష్టి యూపీ పైనే ఉంటుంది. పైగా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 80 లోకసభ స్థానాలకు గాను 73 గెలుచుకుంది. ఇప్పుడు అధికారంలోకి రాకున్నా లేదా ఎక్కువ సీట్లు గెలుచుకోకున్నా కేంద్రంపై వ్యతిరేకత తేటతెల్లమయిందని విపక్షాలు దుమ్మెత్తి పోసే అవకాశముంది. ఈ కారణంగా యూపీ బీజేపీకి చాలా కీలకం.
మినీ సార్వత్రికంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు
ఈ సంవత్సరం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్ట్రోరల్ కాలేజీలో తగినంత మెజారిటీ ఉన్నందువల్ల ఉపరాష్ట్రపతిగా సొంత అభ్యర్థిని నెగ్గించుకొనే విషయంలో బీజేపీకి ఇబ్బందులు లేకపోవచ్చునని, కానీ రాష్ట్రపతి ఎన్నికకు మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు.
ఈ మూడు ప్రధాన కారణం
ఉత్తరప్రదేశ్లో మంచి విజయం సాధించి, ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కువ సీట్లు సాధిస్తే.. రాజ్యసభలో బలం పెంచుకొని, తదుపరి రాష్ట్రపతిగా సొంత అభ్యర్థిని గెలిపించుకునే అవకాశముంటుంది. ఒకటి లోకసభ ఎన్నికల్లో 73 స్థానాలు గెలవడం, రెండు రాష్ట్రపతి ఎన్నికలు, మూడు దేశం దృష్టి అంతా యూపీ పైనే ఉండటం.. ఈ నేపథ్యంలో బీజేపీకి యూపీ చాలా కీలకం.
దెబ్బకొడుతున్న బీఎస్పీ!
బీఎస్పీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని అంటున్నారు. ప్రధానంగా ఆ పార్టీ దళితులకు బదులు ముస్లీంలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అంటున్నారు. అలా ఇవ్వడం రెండు విధాలుగా దెబ్బే అంటున్నారు. ముస్లీంలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు వారికి ఎక్కువ సీట్లు కేటాయించారు. ఒకటి వారికి సీట్లు కేటాయించడం ద్వారా ఎస్పీ, కాంగ్రెస్ వైపు ఉన్న ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చినట్లవుతుందని అంటున్నారు. ఇది కమలానికి లబ్ధి చేకూరినట్లే అంటున్నారు. మరోవైపు, పెద్ద మొత్తంలో పెద్ద నోట్లను మార్చబోయి బీఎస్పీ దొరికిందనే ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యమంత్రిని ప్రకటించకుండానే..
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీఎస్పీ తరఫున మాయావతి, ఎస్పీ తరఫున అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం సాగింది. కానీ కేంద్రంలో ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. అలాంటప్పుడు అలా వెళ్లే ఆస్కారం లేదంటున్నారు.
మోడీ హవాతోనే...
2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవాతో 80 లోకసభ స్థానాలకు గాను 73 సీట్లు బీజేపీ గెలిచింది. ఇటీవల నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. అయితే, నోట్ల రద్దును ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ముఖంతోనే ఎన్నికల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
బీజేపీ గెలిస్తే రేసులో..
యూపీలో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ కూడా సాగుతోంది. ప్ధానంగా కేశవ్ మౌర్య, మనోజ్ సిన్హా, మహంత్ ఆదిత్యనాథ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్ నాథ్ సింగ్ పేరు కూడా నానుతోంది.
కేశవ్ మౌర్య
ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు, ఫుల్పూర్ ఎంపీ కేశవ్ మౌర్య. ఈయన ద్వారా బీఎస్పీతో వెళ్లే యాదవేతర ఓబీసీ ఓటర్లను బీజేపీ టార్గెట్ చేసుకుంది. కాగా, ఈయనకు పరిపాలనా అనుభవం లేకపోవడం మైనస్. కాబట్టి సీఎంగా ఈయనకు అవకాశాలు తక్కువ.
మనోజ్ సిన్హా
మనోజ్ సిన్హా.. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు దగ్గర. ఇతను అప్పర్ క్యాస్ట్ నేత. ఈయనకు పగ్గాలు అప్పగించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమంటున్నారు. ఇతను కేంద్ర టెలికాం మంత్రి. ఘాజిపూర్ నుంచి గెలిపొందారు.
ఆదిత్యానాథ్
ఆదిత్యానాథ్ గోరక్పూర్ ఎంపీ. ఇతనికి ఆరెస్సెస్లోని ఓ వర్గం మద్దతు ఉంది. అతను తన వ్యాఖ్యలతో మీడియాలో నానారు. వీరితో పాటు కేంద్రమంత్రి ఉమాభారతి, మహేష్ శర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కల్రాజ్ మిష్రా పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ.. అతని వయస్సు 75. కాబట్టి పరిగణలోకి తీసుకోకపోవచ్చు అంటున్నారు.