స్పీకర్ పదవీ కోసం పోటీ : రేసులో మేనకా, రాధామోహన్, వీరేంద్ర కుమార్
న్యూఢిల్లీ : 17వ లోక్సభలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం ప్రక్రియ ముగియడంతో .. ఇక స్పీకర్ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. అనుభవం, సామాజిక సమీకరణాలు, ప్రతిభ ఆధారంగా స్పీకర్ పోస్టు అప్పగిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే స్పీకర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
స్పీకర్ పోస్టు కోసం ..
స్పీకర్ పోస్టు కోసం మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మోడీ తొలి క్యాబినెట్లో ఆమె కేంద్రమంత్రిగా పనిచేశారు. మోడీ 2.0 టీంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవీపై ఆశపెట్టుకున్నారు. ఇప్పటికే 8 సార్లు ఎంపీగా గెలిచి అనుభవం ఉన్న నేతల జాబితాలో ముందువరసలో ఉన్నారు మేనకాగాంధీ. కానీ మోడీ మదిలో ఏముందో మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది. మేనకాతోపాటు వీరేంద్రకుమార్, రాధామోహన్ సింగ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఎవరినీ వరించేనో ..
రాధామోహన్ సింగ్ కూడా అనుభవం ఉన్న నేత. ఇప్పటికే ఆరుసార్లు లోక్ సభ ఎన్నికై స్పీకర్ పోస్టు కోసం రేసులో ఉన్నారు. దీనికితోడు ఆయన వివాదరహితుగా పేరుంది. మరోవైపు పార్టీలో కూడా మంచి పట్టు ఉండటంతో స్పీకర్ పోస్టు ఆయననే వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరితోపాటు పాటు వీరేంద్ర కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. వీరేంద్రకుమార్ దళిత నేత, ఇప్పటికే ఆరుసార్లు దిగువసభకు ఎన్నికయ్యారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీరేంద్ర కూడా ముందువరసలో ఉన్నట్టు స్పష్టమవుతుంది.
డిప్యూటీ స్పీకర్ కూడా ..
ఈ ముగ్గురు నేతలతోపాటు బీజేపీ సీనియర్ నేత అహ్లూవాలియా అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఆయనకు సభా వ్యవహారాలపై మంచి పట్టు ఉండటం కలిసొచ్చే అంశం. ఉత్తరాది కాకుండా దక్షిణాది నుంచి స్పీకర్ పదవీ కట్టబెట్టాలని భావిస్తే .. అహ్లువాలియాకు బెర్త్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ పదవీ రేసులో వీరి పేర్లు వినిపిస్తే .. డిప్యూటీ స్పీకర్ బెర్త్ కోసం కూడా చాలా మంది పోటీపడుతున్నారు. భరృహరి మహ్ తాబ్ పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2017లో భర్తృహరి ఉత్తమ పార్లమెంటరియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈయనతోపాటు మరికొందరు కూడా తమ ప్రయత్నాలు జోరుగా చేస్తున్నట్టు తెలిసింది.