కేబినెట్ కూర్పు: డిప్యూటీ సీఎంగా మీసా భారతి?
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈ నెల 20న రాజధాని పాట్నాలో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాకూటమిలోని మూడు పార్టీలు 4:4:2 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవిని మాత్రం తన కూతురు మీసా భారతికి ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడిగే అవకాశాలున్నాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ తరుపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మీసా భారతి ఓటమి పాలయ్యారు.
దీంతో ఆమెను శాసన మండలికి పంపించి డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలన్నది లాలూ ఆలోచనగా బీహార్ రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉండి, తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తన పీఏ భోలా యాదవ్ స్థానాన్ని తన కూతురికి కేటాయిస్తారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక, ఈ ఎన్నికల్లో ఆర్జేడీ తరుపున బరిలోకి దిగిన లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ పోటీచేసే విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి కూడా అడిగే అవకాశం ఉంది. అయితే వీరిద్దరిలో ఎవరిని ఆ మంత్రి పదవి వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే గరిష్టంగా 36 మంది మంత్రులు కేబినెట్లో ఉండే అవకాశం ఉంది. తాజా ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ సైతం కేబినెట్లో ఉండేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఏడు అంశాల కార్యక్రమాన్ని అమలుచేస్తామని తాము బిహార్ ప్రజలకు మాటిచ్చామని, దాన్ని అమలుచేస్తామని బిహార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సీపీ జోషి అన్నారు.