కేంద్రలో చక్రం తిప్పేది ఎవరు..? ప్రాంతీయ పార్టీలో నెలకొన్న ఉత్కంఠ..!!
హైదరాబాద్ : ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అదేదో ఏకలింగం అన్నట్టుగా ఉంది ప్రాంతీయపార్టీల పరిస్థితి. ఎవరికి వారు ఊహాల్లో మేడలు కడుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పే జాబితాలో తామే ఉంటామని లెక్కలు వేసుకుంటున్నారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో తలెత్తని ఓ విధమైన నిశ్చబ్దం, అయోమయ వాతావరణం ప్రస్తుతం నెలకొంది. ఏడాది క్రితం వరకూ నరేంద్రమోదీ హవా తమను గట్టెక్కిస్తుందని అంచనాలు వేసుకున్న బీజేపి కూడా ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రావటం కష్టమనే నిర్ణయానికి వచ్చింది. 200-250 మధ్య ఆగిపోతే ఎవరు వెంట వస్తారు. పార్టీను అధికారంలోకి తెచ్చేందుకు సాయం అందిస్తారనేంత ఆత్మ రక్షణలో బీజేపీ పడిపోయింది.
ప్రాంతీయ పార్టీల ఉబలాటం..!కేంద్రానికి మద్దత్తు తెలిపేందుకు తెగ ఆరాటం..!!
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నంత బలంగా ఏమీలేదు. రాహుల్, ప్రియాంక ను రంగంలోకి దింపినా కేవలం గ్లామర్ కోసమే తప్ప.. ఓట్లను రాల్చే మంత్ర దండం కాదనేది మాత్రం అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛను అవకాశంగగా తీసుకుని తాము చక్రం తిప్పవచ్చనే ఆలోచనతో ప్రాంతీయపార్టీలన్నీ అంచనాలు వేసుకుంటున్నాయి. మోదీపై ఎంతటి వ్యతిరేక ఉందో.. అదే స్థాయిలో తాము కేంద్రంలో పెత్తనం చేస్తూ.. నరేంద్రమోదీకు ఝలక్ ఇవ్వాలనే అక్కసు కనిపిస్తుంది.
ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం ప్రయత్నాలు..! చురుగ్గా కదులుతున్న సౌత్ నేతలు..!!
ఇదంతా ఎమోషన్ రాజకీయమే. దీన్ని అవకాశంగా తీసుకుని.. ప్రాంతీయపార్టీల నేతలు.. ముఖ్యంగా సీనియర్ నేతలంగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, తమ బలాన్ని, పెత్తనాన్ని అంగీకరించే మిత్రుల కోసం గాలిస్తున్నారు. సీనియర్ల జాబితాలో ముందుగా మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్యాదవ్, స్టాలిన్, చంద్రశేఖర్ రావు ,చంద్రబాబు, జగన్ ఇలా ఉత్తర, దక్షిణాది నేతలంతా ఏకతాటిపైకి వచ్చేయాలని ఉబలాటపడుతున్నారు.
అడిగే వరకు ఆగని ఆత్రం..! ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేతలు..!!
దేవెగౌడ, కుమారస్వామి, బిజూ పట్నాయక్ ఇలా.. పది ఎంపీ సీట్లు పక్కా అని భావించిన ప్రతి నాయకుడు.. తాము ప్రతినాయకుడిగా మారి.. మోదీకు కుదరకపోతే.. రాహుల్తో బేరసారాలు సాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పోలింగ్ ముగిసింది. ప్రజల తీర్పు.. ఈవీఎంలలో భద్రమైంది. ఇప్పటికే తాము ఎవర్ని గెలిపించాలనేది ప్రజలు నిర్ణయించేశారు. అయినా.. ఆశచావని నేతలు మాత్రం పైరవీలతో తమను తాము బాహుబలి అనేంతగా చిత్రీకరించుకునే పనిలో పడ్డారు.
కేంద్రప్రభుత్వం పైనే అందరి ద్రుష్టి..! గెలిచే పార్టీకే మద్దత్తు ఇవ్వాలని నిర్ణయం..!!
ఈ వరుసలో ఇద్దరు చంద్రులు మరింత దూకుడుగా వ్యవహరించటం చూస్తుంటే.. ఫలితాలు రాకముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా ఉన్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు సొంత మెజార్టీ సాధించలేక.. చేతులు ఎత్తేస్తే వారికి మద్దత్తు తెలిపి దేశ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రాంతీయ నేతలు ఆరాటపడుతున్నారు.