‘‘ఢిల్లీలో నా మాట ఎవరు వింటారు.. సుష్మా నాతో ఫోన్ లో కూడా మాట్లాడరు’’
ఇప్పుడంటే మోడీ దేశ ప్రధాని. ఆయన ఆకర్షణ, బలం, సామర్థ్యం అన్నీ దేశ ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా చవిచూశారు. కానీ ఒకప్పుడు అలా కాదు...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో ఆయనను బీజేపీ అగ్రనేతలు చిన్నచూపు చూసేవారు. ముఖ్యంగా.. అగ్రనేతలైన మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ వంటి వారు మోడీని కరివేపాకులా తీసిపారేశారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ముఖ్యనేత వద్ద మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు నిర్ణయించిన సమయమది. దీంతో మోడీని కలిసిన ఆ నేత లోక్ సభలో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటూ సుష్మాస్వరాజ్ కు, రాజ్యసభలో అరుణ్ జైట్లీకి చెప్పాలని కోరారట.
దీనికి మోడీ స్పందిస్తూ.. ''నేను గుజరాత్ వాడిని, నా మాట ఢిల్లీలో వినేవారెవరూ లేరు. అంతేకాదు, నన్ను ఢిల్లీకి రానివ్వకుండా కూడా కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. సుష్మాస్వరాజ్ అయితే నాతో ఫోన్ లో కూడా మాట్లాడరు. ఏదైనా మాట్లాడేది ఉంటే ఢిల్లీ రమ్మంటారు. నాకంత అవసరమా?'' అని సదరు నేతతో వ్యాఖ్యానించారట.
కానీ ఆ తరువాత నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అయ్యారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇస్తూనే వారి ప్రాభవాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశారు. దీనికి మంచి ఉదాహరణ కూడా సుష్మా స్వరాజే.
ఈమెకు నరేంద్ర మోడీ విదేశాంగ శాఖను కట్టబెట్టారు. కానీ ఆమెకు ప్రాధాన్యం లేకుండా చేశారు. అలాగే ప్రస్తుతం మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం నిజానికి పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిదే. అక్కడి నుంచి మోడీ బరిలోకి దిగుతానని అడిగినప్పుడు జోషి తీవ్రంగా వ్యతిరేకించారు కూడా.
ఇది మనసులో పెట్టుకున్న మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఆయనను పూర్తిగా దూరం పెట్టేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోడీ ప్రభంజనం తరువాత పార్టీలో మిగిలిన సీనియర్ నేతలు ఎవరైనా ఉంటే.. వాళ్లు కూడా ఈపాటికి తట్టా బుట్టా సర్దేసుకుని ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.