రాజస్థాన్ లో గెలుపెవరిది..? రాజ్ పుత్ లా..? లేక జాట్ లదా..! గెలుపువై ధీమాగా ఉన్న కాంగ్రెస్..!!
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం రాజస్తానే. మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్కు అంత దీమా లేకపోయినా.. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ అధికార బీజేపీ కాదని, ప్రజలు పూర్తిగా కాంగ్రెస్కే పట్టం గట్టారు. ఇదే ఊపుతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. 200 స్థానాలు ఉన్న రాజస్తాన్లో కాంగ్రెస్, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి వసుంధర రాజే చెబుతున్నప్పటికీ.. ఆమె పాలనపై మాత్రం ప్రజల్లో ఆశలు సన్నగిల్లాయి. నిరుద్యోగం, అవినీతి పెచ్చురిల్లడంతో రాజస్థానీయులు ఆమె పాలనపై విసుగు చెందారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో వచ్చని చేదు ఫలితాలే అందుకు నిదర్శనం. అదీగాక 1993 మొదులుకుని ఇప్పటివరకు వరుసగా ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలో రాలేదు.
రాజస్తాన్లో రసవత్తర పోరు..! సెమీఫైనల్స్ను తలపిస్తున్న ఎన్నికలు..!!
రాజవంశాల పాలనకు కేరాఫ్ బిందువుగా ఉన్న రాజస్తాన్లో రసవత్తర పోరు రాజుకుంది. తెలంగాణతో పాటు రాజస్థాన్ లో కూడా ఒకేసారి డిసెంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. సెమీఫైనల్స్ను తలపిస్తున్న ఎన్నికల్లో రాజస్తాన్ కీలకంగా మారింది. గత రెండున్నర దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీలకు మార్చి మార్చి అధికారాన్ని అప్పగిస్తున్న రాజస్తానీయలు ఈ ఎన్నికల్లోనూ అదే సంప్రదాయాన్నిపాటిస్తారా..? లేదంటే కొత్త సంప్రదాయానికి తెర తీస్తారా..? అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్తాన్లో వసుంధరరాజే వర్సెస్ సచిన్ పైలట్, అశోక్గెహ్లాట్గా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతిసారి అధికార బదిలీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతూనే ఉంది. అదే సంప్రదాయం పాటిస్తే ఈ సారి కాంగ్రెస్ గెలుపు సునాయాసమే. కానీ మోడీ చరిష్మా, అమిత్ షా వ్యూహాన్ని దాటుకుని కాంగ్రెస్ విజయం సాధిస్తుందా.. అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల బీజేపీ, మోడీ గ్రాఫ్ పడిపోవడం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశంగా పరిణమించింది.
కులాలదే కీలక భూమిక..! రాజస్థాన్ భవితవ్యం తేల్చనున్న ఆ నాలుగు కులాలు..!!
రాజస్తాన్ ఎన్నికల్లో ప్రధానంగా కులాలదే కీలక భూమిక. రాజ్పుట్లు, గుజ్జర్లు, జాట్లు, ముస్లింలు, ఈ నాలుగు వర్గాల ఓట్లే ఇక్కడ కీలకంగా మారాయి. బికనేర్, షేక్వటీ, జైపూర్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండగా మార్వాడ్, మేవాడ్, జైపూర్లో రాజ్పుట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మార్వాడ్లో రాజ్పుట్లదే అధిపత్యం. ప్రతి ఎన్నికల్లోనూ రాజ్పుట్లో బీజేపీకి మద్దతుగా నిలస్తున్నారు. అయితే.. ఈసారి వసుంధర రాజే ఏకపక్షధోరణి కారణంగా ఈ వర్గంలోనూ చాలా మంది బీజేపీకి దూరమవయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్కు గుజ్జర్లు, జాట్లు, ముస్లింలు మద్దతుగా ఉన్నారు. ఇప్పడు బరిలో చిన్న పార్టీలు ఎక్కవుగా ఉండటంతో వీరంతా కాంగ్రెస్ వెంటే నడుస్తారా అన్నది ప్రశ్న. అశోక్గెహ్లాట్ను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించకపోవడం, సచిన్పైలట్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారంతో మాలి కాంగ్రెస్కు మద్దతుగా ఉంటారో లేదో అన్నది మరో ప్రశ్న. సచిన్పైలట్ కారణంగా ఆయన వర్గానికి చెందిన గుజ్జర్లుపూర్తిగా కాంగ్రెస్ వెంట నడుస్తున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163, కాంగ్రెస్ 41, బీఎస్పీ 3 సీట్లు సాధించాయి. ఈసారి సర్వేలు అన్నీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ 120-140 స్థానాలు సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది.
ఘన్శ్యామ్ తివారీ వల్ల బీజేపికి దెబ్బ..! ఓటర్లు చీలిపోయే అవకాశం..!!
రాజస్తాన్లో రాజ్పుట్లో 9 శాతం వరకు ఉన్నారు. వీరు రాష్ట్రంలోని సగం నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ 35 నియోజకవర్గాల్లో మాత్రం గెలుపోటములు వీరి చేతుల్లో ఉంది. 12శాతం ఉన్న జాట్లు వంద నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు. 40 నియోజకవర్గాల్లో గెలుపోటములు వీరి చేతుల్లోనే ఉంది. గుజ్జర్లు మొత్తం జనాభాలో 6శాతం మంది ఉన్నారు. వీరు 20-25 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంది. ఇక ముస్లింలు 7శాతం, బ్రహ్మణులు 7శాతం ఉన్నారు. ఇందులో ముస్లింలు కాంగ్రెస్కు మద్దతుగా ఉండగా బ్రహ్మణులు బీజేపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు బ్రహ్మణులు బీజేపీకి దూరం అయ్యారు. బ్రహ్మణ వర్గం నేత ఘన్శ్యామ్ తివారీ బీజేపీకి వ్యతిరేకంగా భారత వాహిని పార్టీ పెట్టుకున్నాడు. దీంతో ఆ వర్గమంతా ఈ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
మూడు పార్టీల ప్రభావమెంత..? కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం..!!
జాట్నాయకుడు హనుమాన్బేణీవాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీని స్థాపించి ఘన్శ్యామ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. హనుమాన్ బేణీవాల్ కారణంగా జాట్ వర్గానికి చెందిన ఓటర్లకు రెండు పార్టీలకు దూరం అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మరోవై పు కాంగ్రెస్ మాత్రం ఈ రెండు పార్టీలపై విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కారణంగా హనుమాన్బేణీవాల్, ఘన్శ్యామ్లు పార్టీలు పెట్టి ఒక్కయ్యారని, ఎన్నికలయ్యాక వారు తిరిగి బీజేపీతో కలుస్తారని కాంగ్రెస్ చెబుతోంది. బేణీవాల్ పెట్టే సభలకు పెద్ద ఎత్తున జనం రావడం వెనక కూడా బీజేపీ ఆర్థిక సహకారం ఉందని చెబుతున్నారు. ఇక ఈ రెండు పార్టీలకు తోడుగా బీఎస్పీ కూడా జతకలిసింది. రాష్ట్రంలో 18శాతం మంది దళితులు ఉన్నారు. వీరి ఓట్లపై బీఎస్పీ ఆశలు పెట్టుకుంది. మూడు స్థానాల్లో బీఎస్పీ విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు కూడా చెబుతున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీ మద్య స్నేహం ఉన్నప్పటికీ మాయావతిపై ఉన్న సీబీఐ కేసుల కారణంగా బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్తో కలిసి నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు మాయావతి వెనుకడుగు వేశారు. దీంతో దళితులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి బీఎస్పీతోపాటు కాంగ్రెస్తోనూ జత కలిసే అవకాశం ఉంది.