యడియూరప్ప మంత్రి వర్గానికి కేజేపీ దెబ్బ: వారికే మంత్రి పదవులు, అమిత్ షా ఎఫెక్ట్ !
బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గం లేకపోవడంతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఒక్కరే ఆ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద నీట మునిగిన ఉత్తర కర్ణాటక, మలెనాడు, కరావళి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరద ప్రాంతాల భాదితులను ఆదుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న యడియూరప్ప వరద ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాలు పరిశీలించి స్థానికులకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు యడియూరప్ప మీద ప్రతిపక్షాలు అలాంటి ఆరోపణలు చేస్తున్నాయి.
అమిత్ షా ఆదేశాలు
మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ అనుమతి తీసుకోవాలని ఇటీవల యడియూరప్ప ఢిల్లీ వెళ్లారు. సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మరణించడంతో బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీఎం యడియూరప్ప భేటీ తాత్కాలికంగా వాయిదా పడింది. ముందు కర్ణాటకలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి చక్కదిద్దిన తరువాత ఢిల్లీ రావాలని అమిత్ షా ముఖ్యమంత్రి యడియూరప్పకు సూచించారు. అమిత్ షా ఆదేశాలతో బెంగళూరు చేరుకున్న యడియూరప్ప కర్ణాటకలోని వరద నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
యడియూరప్ప ఎక్కడున్నావ్ అప్ప
మంత్రివర్గం లేకపోవడంతో యడియూరప్ప ఒక్కరే భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రులు లేకపోవడంతో అధికారుల మీద సీఎం యడియూరప్ప ఆధారపడుతున్నారు. ప్రభుత్వం వరద భాదితులను ఆదుకోవడం లేదని, పరిహారం అందడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మీరు ఏం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఏకంగా యడియూరప్ప ఎక్కడున్నావ్ అప్ప అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కేజేపీ దెబ్బతో మంత్రివర్గం ఆలస్యం
గతంలో బీజేపీ మీద తిరుగుబాటు చేసిన యడియూరప్ప 2012లో కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) ఏర్పాటు చేశారు. కేజేపీ సింబల్ (టెంకాయ) మీద పోటీ చేసిన యడియూరప్పతో పాటు ఆరు మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పట్లో తన రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చిన నాయకులకు ఇప్పుడు యడియూరప్ప ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, మంత్రివర్గంలో వారికే చోటు కల్పించే అవకాశం ఉందిని ప్రచారం జరుగుతోంది. యడియూరప్ప మంత్రివర్గం ఎర్పాటు కావడానికి కేజేపీ కూడా ఒక కారణం అని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.
క్యూలో ఆ లీడర్స్
బీజేపీ మీద తిరుగుబాటు చేసిన సమయంలో యడియూరప్ప ఏర్పాటు చేసిన కేజేపీకి ఏకంగా 10 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. పలు నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడానికి కేజేపీ కారణం అయ్యింది. ఇప్పుడు యడియూరప్ప మంత్రి వర్గం ఏర్పాటు కోసం పంపించిన జాబితాలో ఎక్కువగా ఆయన అనుచరుల పేర్లు ఉన్నాయని సమాచారం. అందుకే అమిత్ షా ఆయన దగ్గర ఉన్న జాబితాను పరిశీలిస్తున్నారని, అందుకే మంత్రివర్గం ఏర్పాటు చెయ్యడానికి ఆలస్యం అవుతోందని సమాచారం.
ఢిల్లీకి సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప త్వరలో ఢిల్లీ వెళ్లడానికి హైకమాండ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులు అదుపులోకి తీసుకు వచ్చిన తరువాతే ఢిల్లీ వెళ్లాలని యడియూరప్ప నిర్ణయించారని సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలు, అధికారుల సహాయంతో యడియూరప్ప భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల దెబ్బకు మరణించిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు నష్టపరిహారం అందిస్తామని సీఎం యడియూరప్ప ప్రకటించారు.