మా భార్యా, పిల్లలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: కేజ్రివాల్
న్యూఢిల్లీ: తమ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్కు మహిళా కమిషన్ సమన్లు జారీ చేయడంపై స్పందించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రివాల్ నిరాకరించారు. అయితే ప్రభుత్వాన్ని, ఆప్ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
‘మా పిల్లలు, భార్యలను ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?' అని కేజ్రివాల్ మీడియాను ప్రశ్నించారు. ఆప్ను అంతం చేసేందుకు మీడియా భారీ మొత్తంలో సుపారీ తీసుకుందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ విధమైన ఆరోపణలకు దిగారు.
ఇటీవల ఓ ఆప్ మహిళా కార్యకర్త తనతో కుమార్ విశ్వాస్కు వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేత కుమార్ విశ్వాస్, అతని భార్యకు సమన్లు జారీ చేసింది. దీనిపై మీడియా కేజ్రివాల్ను ప్రశ్నించగా ‘మేం ఇప్పుడు మౌనంగా ఉండాలనుకుంటున్నాం. ప్రభుత్వంపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్తాం' అని అన్నారు.
కాగా, బర్కా శుక్లా సింగ్ నేతృత్వంలోని మహిళా కమిషన్ నుంచి తనకు ఎలాంటి సమన్లు అందలేదని కుమార్ విశ్వాస్ తెలిపారు. కాంగ్రెస్, బిజెపిలు తనపై, తమ పార్టీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
ఇది ఇలా ఉండగా తమ వద్దకు న్యాయం కోసం వచ్చిన మహిళకు మద్దతుగా నిలవడం మా బాధ్యత అని మహిళా కమిషన్ చీఫ్ బర్కా శుక్లా సింగ్ తెలిపారు. ‘ఆప్ చెప్పేవి వాస్తవాలా? కదా? అనే విషయం త్వరలోనే తెలుస్తుంది. సమస్య పరిష్కారం కోసం కుమార్ విశ్వాస్ తమ వద్దకు వచ్చి కలవాల్సిన అవసరం ఉంది' అని చెప్పారు.