త్వరలో భారతీయుల కంటే బంగ్లాదేశీయులే ధనికులవుతారా ? ప్రపంచ బ్యాంకు అంచనాలు..
భారత్లో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పలు పరిణామాలు ఆర్ధికంగా కుంగదీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ రాక, కరోనా ప్రభావం వంటి సమస్యలతో భారత ఆర్దిక వ్యవస్ధ ఎన్నడూ లేనంత దారుణ ఉత్పాతాన్ని చవిచూడబోతోందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రపంచ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ తాజాగా వెలువరించిన అంచనాలను బట్టి చూస్తే భారతీయుల కంటే బంగ్లాదేశీయులే ధనికులు కాబోతున్నట్లు తెలుస్తోంది. జీడీపీ లోటుతో పాటు ఇతర పరిస్ధితులను అధ్యయనం చేసిన తర్వాత ఐఎంఎఫ్ వెలువరించిన అంచనాలు భారత్కు పెను ప్రమాదం తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి.
ప్రపంచబ్యాంకు తాజా అంచనాలు..
వచ్చే ఐదేళ్లలో భారత్ జేడీపీ సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర పెరగనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. అలాగే పొరుగున ఉన్న చిన్న దేశం బంగ్లాదేశ్ జీడీపీ 171 బిలియన్ డాలర్లు అదనంగా సాధిస్తుందని అంచనా వేస్తోంది. అయితే భారత్లో జనాభా, నిరంతర ఆర్ధిక సవాళ్ల కారణంగా బంగ్లాదేశ్ కంటే వెనుకబడే ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ లెక్కన చూస్తే రాబోయే ఐదేళ్లలో భారత్ కంటే బంగ్లాదేశ్ పౌరులే మెరుగైన స్ధితిలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ భారత్ జీడీపీని దాటేస్తుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఐదేళ్లలో భారత్ మరింత పేద దేశంగా మారుతుందనే సంకేతాలను ఐఎంఫ్ ఇవ్వడం ఆందోళన రేపుతోంది.
భారత్ కంటే ధనిక దేశంగా బంగ్లాదేశ్...
భారతదేశ తలసరి జీడీపీ 2020 లో ఉన్న 1,877 డాలర్ల నుండి 2025 లో 2,729 డాలర్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది, బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 2020 లో ఉన్న 1,888 డాలర్ల నుంచి 2025 నాటికి 2,756 డాలర్లకు పెరుగుతోంది. దీని ప్రకారం చూస్తే ఈ ఏడాది భారత్ కంటే ధనిక దేశంగా అవతరించనున్న బంగ్లాదేశ్.. వచ్చే ఐదేళ్ల తర్వాత కూడా అదే స్ధాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
భారత్ వెనుకబాటుకు కారణాలివే..
భారత్ కంటే బంగ్లాదేశ్ ధనిక దేశంగా మారుతుండటానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది భారత్ తన జీడీపీలో ఉన్న తలసరి ఆదాయం మైనస్ 10.3కు చేరడం అయితే రెండోది ఐదేళ్ల తర్వాత కూడా భారత్.. బంగ్లాదేశ్ ఆర్ధికాభివృద్ధిని అందుకునే సూచనలు లేకపోవడం. ప్రస్తుత బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి 3.8 శాతం అయితే భారత్ జీడీపీ వృద్ధి మైనస్ 10.8గా నమోదవుతోంది. 2016 నుంచి భారత్ జీడీపీ క్రమంగా క్షీణిస్తుండగా.. బంగ్లాదేశ్ జీడీపీ మాత్రం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కరోనా ప్రభావంతో భారత్ లో ఆర్ధిక వ్యవస్ధ కుదేలైనా బంగ్లాలో పరిస్ధితులు మాత్రం చాలా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కారణాలతో వచ్చే ఐదేళ్లలో బంగ్లాదేశ్ భారత్ కంటే ధనిక దేశంగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. అలా జరగకుండా ఉండాలంటే భారత్లో ఏదైనా అద్భుతం జరగాల్సిందేనని ఆర్ధికవేత్తలు, నిపుణులు సైతం చెబుతున్నారు.
కరోనా తర్వాత కూడా అదే పరిస్ధితి...
కరోనా కంటే పతనమైన భారత ఆర్దిక వ్యవస్ధ.. ఆ తర్వాత కూడా ఏమాత్రం మెరుగుపడే అవకాశాల్లేవనే అంచనాలు భయపెడుతున్నాయి. కరోనా తర్వాత భారత్లో ఆర్ధిక వృద్ధి 7.2 శాతం ఉండొచ్చని, అదే బంగ్లాదేశ్లో అయితే 7.3 శాతం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేస్తోంది. 2015లో భారతదేశ తలసరి జీడీపీ 1606 డాలర్లు కాగా... బంగ్లాదేశ్లో 1221 డాలర్లు. 2019 వరకూ దాదాపు ఇదే పరిస్ధితి కొనసాగింది. కరోనాకు ముందు వరకూ కూడా భారత తలసరి జీడీపీ 2098 డాలర్లుగా ఉంది. అదే సమయంలో బంగ్లా తలసరి జీడీపీ 1816 డాలర్లే ఉండేది. కానీ కరోనాతో లెక్కలన్నీ తారుమారయ్యాయి. బంగ్లా ప్రస్తుతం మెరుగైన పరిస్ధితుల్లో కనిపిస్తోంది. కరోనా కారణంగా బంగ్లాదేశ్ కూడా ఇబ్బందులుప పడినా, దాని ఆర్ధికవ్యవస్థ మెరుగ్గా ఉంది. కరోనా ప్రభావం భారత్తో పోలిస్తే చాలా స్వల్పంగా ఉంది. భారత్లా ఎగుమతులు తగ్గలేదు, పెట్టుబడులు స్తంభించిపోలేదు. దీంతో రాబోయే ఐదేళ్లలో భారత్తో పోలిస్తే బంగ్లా ఎన్నో అంశాల్లో మెరుగుపడి ధనిక దేశంగా పేరుతెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.