కేంద్రంలో బీజేపీ సర్కారు రావాలంటే దక్షిణాది రాష్ట్రాల మద్దతు తప్పనిసరి..?
దేశంలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారం చేపట్టాలంటే దక్షిణాది రాష్ట్రాల మద్దతు కూడా తప్పని సరిగా కనిపిస్తోంది. మోడీ తిరిగి సౌత్ బ్లాక్లో అడుగుపెట్టాలంటే ఆయన పయనం సౌత్ స్టేట్స్గుండా వెళ్లాల్సిందే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే తిరిగి ప్రభుత్వం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ... అది అంత సులభతరం కూడా కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్లకు పెద్దగా చోటు లేదనే చెప్పాలి. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలు కీలకంగా మారే అవకాశం ఉంది.
కొడుక్కి కాంగ్రెస్ ఎంపీ టికెట్.. పార్టీకి ప్రచారం చేయనంటున్న బీజేపీ మంత్రి
దక్షిణాది రాష్ట్రాలే ఎందుకు కీలకం..?
ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే రెండు జాతీయపార్టీల చూపు దక్షిణాది రాష్ట్రాలపై పడింది. ఇక బీజేపీ విషయానికొస్తే ఉత్తర్ప్రదేశ్లో 40 సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోందంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ - బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు జతకట్టడమే కారణంగా వారు చెబుతున్నారు. ఇక హిందీ ప్రధాన రాష్ట్రాల్లో 20 సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశం కనిపిస్తుండగా ఇక మరో 20 సీట్లు దేశవ్యాప్తంగా బీజేపీకి దక్కే అవకాశాలు లేవని చెబుతున్నారు.
మొత్తంగా 80 స్థానాలు బీజేపీ కోల్పోయే అవకాశం
యూపీలో, హిందీ ప్రధాన రాష్ట్రాల్లో ఇక ఇతరత్రా చోట్ల బీజేపీ కోల్పోయే 80 స్థానాలు ఎక్కడో ఒక చోట నుంచి రాబట్టాలంటే విజయం సాధించాలి. ఇప్పటికే ఉత్తర భారతంలో బీజేపీకి పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈశాన్య భారతంలో కూడా బీజేపీ కొంత పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక పశ్చిమ భారతంలో కూడా బీజేపీ ప్రభావం కొంత కనిపిస్తోంది. ఇక ఐదు దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరితో కలిపి 130 ఎంపీ స్థానాలున్నాయి. 2014లో మోడీ మానియా ఉన్న సమయంలోనే బీజేపీకి ఈ రాష్ట్రాల నుంచి 20 స్థానాలు వచ్చాయి. ఇందులో ఒక్క కర్నాటక నుంచే 17 స్థానాలు రాగా ఏపీ నుంచి రెండు స్థానాలు తమిళనాడు నుంచి ఒక స్థానం బీజేపీ గెలుపొందింది. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో హిందూత్వ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ పెద్దగా లేదు. ఏపీ, తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువగా కనిపిస్తుంది.ఇక్కడ స్థానిక నాయకులు, సమస్యలు, సంస్కృతి, భాషలపైనే పార్టీలు ఆధారపడుతాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఇక్కడ పెద్దగా స్థానం ఉన్నట్లుగా కనిపించదు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఇదీ
ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు పెద్దగా లేదు. టీడీపీతో పొత్తుతో వెళ్లడం వల్ల 2014లో రెండు స్థానాలు దక్కించుకుంది బీజేపీ. ఇక ఏపీలో ప్రధాన యుద్ధం టీడీపీ వైసీపీల మధ్యే ఉండనుంది. ఎన్నికల తర్వాత బీజేపీ వైసీపీ సాయం కోరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఎవరితోనూ పొత్తుతో వెళ్లడం లేదు. కాంగ్రెస్, వైసీపీ పార్టీలు రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలిగి ఉండగా... టీడీపీ కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకుగా గుర్తింపు ఉంది. ఇక జనసేన పార్టీ కూడా బరిలో ఉండటంతో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఈ పార్టీకి మరలే అవకాశం ఉంది. ఈ సమీకరణాలను చూస్తే బీజేపీకి ఒక్క స్థానం కూడా ఏపీ నుంచి రాదని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే... తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తోంది బీజేపీ. అంతేకాదు ఇక్కడ రాజకీయంగా బీజేపీకి పెద్దగా ప్రాధాన్యత లేదు.అంతేకాదు ఎన్నికల తర్వాత బీజేపీ టీఆర్ఎస్ సహాయం కోరే అవకాశం కనిపిస్తోంది.బీసీల్లో టీఆర్ఎస్కు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. అంతేకాదు దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీల ఓటు బ్యాంకుపై కూడా దృష్టి సారించింది.ఇప్పుడు టీడీపీ కూడా తన ప్రాబల్యం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేదు. బీజేపీది కూడా అదే పరిస్థితి. ఇక ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మహా అంటే ఒక సీటు వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ ఉత్తరాది పార్టీగా ముద్ర
కేరళలో అయితే ఎల్డీఎఫ్, లేదా యూడీఎఫ్ల ప్రభావమే కనిపిస్తుంది. ఒక్క కర్నాటకలోనే బీజేపీ ప్రభావం కనిపిస్తుంది.2007లో పూర్తి స్థాయిలో కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ దూసుకెళ్లలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీని ఉత్తరాది పార్టీగా ప్రజలు భావించడమే. మరోవైపు బీజేపీలో దృఢమైన నాయకులు లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకో వైపు ప్రాంతీయ పార్టీల పుట్టుకకు వారి వారి సొంత కారణాలు ఉన్నాయి కానీ బీజేపీకి ఇక్కడ ఎలాంటి కారణం కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కర్నాటక మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇక్కడి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే కీలకం కానున్నాయి.
కర్నాటకలో బీజేపీ గేమ్ ప్లాన్
కర్నాటకలో బీజేపీ ఓబీసీ, దళితులు, గిరిజనుల ఓట్లు చీల్చడంలో విజయం సాధించగలిగితే ఎలాగూ లింగాయత్ సామాజిక వర్గం బీజేపీతోనే ఉంటుంది కాబట్టి గెలుపు కాస్త ఈజీగానే ఉంటుంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు పట్టులేని ప్రాంతాల్లో కూడా విజయం సాధించింది ఇది కచ్చితంగా శుభపరిణామంగానే చూస్తోంది ఆపార్టీ. అయితే జేడీఎస్ కాంగ్రెస్ల మధ్య కుదిరిన పొత్తు బీజేపీకి కాస్త ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ అక్కడ నాయకత్వలోపం బీజేపీ బలహీనపరుస్తోంది.అంతేకాదు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి తర్వాత ఇటు అన్నాడీఎంకేలోనూ నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తమిళనాడులో బీజేపీ పొత్తులో భాగంగా ఐదు స్థానాల్లో పోటీచేయనుండగా... ఇందులో కనీసం మూడు సీట్లు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోది.
మొత్తానికి ఒకవేళ బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో దక్షిణాదిన గెలిచే పార్టీలపైనే ఆధారపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయని జోస్యం చెబుతున్నారు.