ఎమ్మెల్యేనే కాదు, డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ? హై కమాండ్ శ్రీరామరక్ష, పొర్న్ వీడియో!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మంత్రివర్గంలో శాఖల పంపకాలు, ఉప ముఖ్యమంత్రి పదవుల కేటాయింపు విషయంలో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి, అసెంబ్లీలో పొర్న్ వీడియోలు చేశారని ఆరోపణలు ఉన్న వ్యక్తి లక్ష్మణ సవదికి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. అయితే హైకమాండ్ శ్రీరామ రక్ష ఉందని, వారి లెక్కలు వారికి ఉన్నాయని సమాచారం.
మహారాష్ట్రలో సవది హవా !
మహారాష్ట్రలోని కోల్లాపుర, పూణే తదితర భాగాల్లో లక్ష్మణ సవది హవా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. లక్ష్మణ సవదికి కీలక పదవి ఉంటే ఈ ప్రాంతాల్లో బీజేపీకి లాభం ఉంటుందని మహారాష్ట్ర బీజేపీ నాయకులు ఆ పార్టీ హైకమాండ్ కు మనవి చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మణ సవదికి హైకమాండ్ పెద్దపీట వెయ్యడంతో కర్ణాటక బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
మహారాష్ట్రలో ఎన్నికలు !
మహారాష్ట్రలో ఇదే సంవత్సరం చివరిలో శాసన సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శాసన సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు లక్ష్మణ సవదికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తరువాత కథ తరువాత చూద్దామని బీజేపీ హైకమాండ్ కర్ణాటక నాయకులకు చెప్పిందని తెలిసింది. ఇదే విషయంలో బీజేపీ హైకమాండ్ అనర్హత ఎమ్మెల్యే మహేష్ కుమటహళ్ళికి నచ్చ చెప్పిందని తెలిసింది.
శ్రీరాములుకు ఏం తక్కువ ?
ఉప ముఖ్యమంత్రి పదవి లక్ష్మణ సవదికి ఇచ్చారని, మా నాయకుడు బళ్లారి శ్రీరాములుకు ఏం తక్కువ ? అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే మీరు మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలని, వాల్మీకి (బోయ), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు మీ వెంటే ఉన్నాయని, ధైర్యంగా ఉండాలని పలువురు నాయకులు శ్రీరాములు మీద ఒత్తిడి చేస్తున్నారని వెలుగు చూసింది. మొదట శ్రీరాములు ఒక్కరే ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. అనేక నియోజక వర్గాల్లో ప్రచారం చేసిన శ్రీరాములు బీజేపీ నాయకులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు.
జారకిహోళి బ్రదర్స్ కు చెక్ ?
బెళగావి జిల్లాలో జారకిహోళి కుటుంబ సభ్యుల హవా ఎక్కువగా ఉంది. బెళగావి జిల్లాలో జారకిహోళి కుటుంభానికి ఉన్న పట్టును తప్పించడానికి లక్ష్మణ సవదిని తెర మీదకు తెచ్చారని సమాచారం. రమేష్ జారకిహోళి ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు జారకిహోళి సోదరులకు మంత్రి పదవులు లేవు. లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జారకిహోళి సోదరులను కంట్రోల్ చెయ్యాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఫైర్ బ్రాండ్ లక్ష్మి హెబ్బాళ్కర్
బెళగావి జిల్లాలో జారకిహోళి కుటుంభాన్ని మొదటి నుంచి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ లక్ష్మి హెబ్బాళ్కర్ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు. లక్ష్మణ సవదిని తెరమీదకు తెచ్చి లక్ష్మి హెబ్బాళ్కర్ కు కళ్లెం వెయ్యాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. మొత్తం మీద అన్నీ అనుకూలించడంతో లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చిందని సమాచారం.
పొర్న్ వీడియో దెబ్బ పని చెయ్యలేదు
కర్ణాటకలో ఇంతకు ముందు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో లక్ష్మణ సవది మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో అసెంబ్లీలో మంగళూరు రేవ్ పార్టీ వివాదం మీద వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో లక్ష్మణ సవది మొబైల్ లో పొర్న్ వీడియో చూస్తూ మీడియా కెమెరాలకు చిక్కారు. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయ్యడంతో అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న లక్ష్మణ సవది మీద విమర్శలు చెయ్యడానికి ప్రతిపక్షాలు సిద్దం అయ్యాయి.