అసెంబ్లీలో పొర్న్ వీడియోలు చూశారు, నేడు మంత్రులు అయ్యారు, చిక్కుల్లో బీజేపీ, ప్రతిపక్షాలు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం మీద ఆరోపణలు చెయ్యడానికి ప్రతిపక్షాలకు పెద్ద ఆస్త్రం చిక్కింది. ప్రజా ప్రతినిధులు కొలువు తీరే అసెంబ్లీలో పొర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కైన నాయకులు ఇప్పుడు యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన బీజేపీ చిక్కులు కోరి కొని తెచ్చుకుంది.
ఆగస్టు 20వ తేదీ మంగళవారం కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ సవది, సీసీ పాటిల్ యడియూరప్ప మంత్రి వర్గంలో ఉన్నారు. ఇదే లక్షణ సవది, సీసీ పాటిల్ అసెంబ్లీలో పొర్న్ వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా చిక్కిపోయారు.
2012లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో అసెంబ్లీలో లక్ష్మణ సవది, సీసీ పాటిల్, క్రిష్ణ పాలేమార్ మంత్రులుగా ఉన్నారు. అసెంబ్లీలో ఈ నాయకులు పొర్న్ వీడియోలు చూస్తూ మీడియా వీడియో కెమెరాలకు అడ్డంగా చిక్కిపోయారు.
ఆ సమయంలో అసెంబ్లీలో మంగళూరులో జరిగిన రేవ్ పార్టీ మీద తీవ్రస్థాయిలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో పొర్న్ వీడియోలు చూస్తూ లక్ష్మణ సవది, సీసీ పాటిల్, క్రిష్ణ పాలేమార్ వీడియో కెమెరాలకు చిక్కిపోయారు. తాము పొర్న్ వీడియోలు కావాలని చూడలేదని అప్పట్లో ఈ నాయకులు సమర్థించుకున్నారు.
ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో లక్ష్మణ సవది, సీసీ పాటిల్, క్రిష్ణ పాలేమార్ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ నాయకుల మీద స్థానిక నియోజక వర్గాల్లో వ్యతిరేకత ఉంది. 7 ఏళ్ల తరువాత మళ్లీ యడియూరప్ప ప్రభుత్వంలో లక్ష్మణ సవది, సీసీ పాటిల్ లకు మంత్రి పదవులు దక్కాయి.
2018 శాసన సభ ఎన్నికల్లో సీసీ పాటిల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ సవది ఓడిపోయారు. లక్ష్మణ సవది మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం మీద అసెంబ్లీలో పొర్న్ వీడియోలు చేశారని వివాదంలో చిక్కుకున్న ఇద్దరు నాయకులు మంత్రులు కావడంతో బీజేపీ నాయకులు ఇరకాటంలో పడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లక్ష్మణ సవదికి మంత్రి పదవి ఇచ్చి మరి కష్టాలు కొని తెచ్చుకున్నారు.