‘మహిళలకు నలుగురు భర్తలు ఎందుకు ఉండకూడదు?’
కోజికోడ్: 'ముస్లిం పురుషుడికి నలుగురు భార్యలు ఉండవచ్చని చెప్పినప్పుడు.. మహిళలకు ఎందుకు నలుగురు భర్తలు ఉండకూడదు?' అంటూ కేరళ హైకోర్టు జడ్జి బి. కెమల్ పాషా కోజికోడ్లో గత ఆదివారం జరిగిన ముస్లిం మహిళా సమాఖ్య సభలో ప్రశ్నించారు.
ముస్లిం వ్యక్తిగత చట్టాలు అత్యధికంగా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పురుషాధిక్యతకు కారణం మత పెద్దలేననని చెప్పారు. సున్నితమైన అంశాలపై మత చర్చల్లో ఆత్మావలోకనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అర్థవంత జీవితం గడిపేందుకు పురుషుడికైనా, మహిళకైనా ఒక భాగస్వామి చాలన్నారు. క ట్నం, విడాకులు వంటి అంశాల్లో మహిళలపై ముస్లిం పర్సనల్ లా వివక్ష చూపుతోందని, ఖురాన్ చెబుతున్న దానికి అవి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించడంలో వివక్ష సృష్టించిన మతనేతలు భయపడకూడదని, పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని అన్నారు.
బహు భార్యత్వాన్ని అనేక ముస్లిం దేశాలు నిషేధించినప్పటికీ, భారతదేశంలో ఇప్పటికీ అమల్లో ఉందని పాషా అన్నారు. ఏకపక్ష తీర్పులిచ్చేందుకు తమకు అర్హత ఉందో, లేదో మత పెద్దలు ఆలోచించాలని కోరారు. అటువంటి తీర్పులిచ్చేవారి అర్హతలేమిటో ప్రజలు కూడా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
మహిళలకు ఖురాన్ కల్పించిన హక్కులకు కూడా వారు దూరమవుతున్నారని తెలిపారు. ఈ అన్యాయానికి తెరదించేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముస్లిం పర్సనల్ లా వివక్షాపూరితంగా ఉందని, సమానత్వాన్ని నిరాకరించడమే కాకుండా ఆస్తి హక్కు, తదితర హక్కులను తిరస్కరిస్తోందని తెలిపారు.
అన్ని న్యాయసూత్రాలు రాజ్యాంగంలోని సమానత్వం, గౌరవంగా జీవించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 14, 21కు లోబడి ఉండాల్సిందేనని తెలిపారు. ప్రస్తుత న్యాయం ఖురాన్కు అనుగుణంగా లేదని, పర్సనల్ లాలో మార్పులు రావాలని న్యాయమూర్తి పాషా అన్నారు.