నిరుద్యోగం, ఆర్థికవృద్ధి సమస్యలు ఉండగా దానిపైనే ఫోకస్ ఎందుకు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్య ఉండగా దానికి పరిష్కారం కనుగొనడం మానేసి పౌరసత్వ సవరణ చట్టంతో పనేంటని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ సమయంలో ఈ బిల్లును పాస్ చేయించాల్సిన అవసరం ఏముందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణ సమస్య, ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడం వంటి అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఉద్యోగాలు లేక యువత చాలా బాధపడుతున్నారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి తప్పితే అనవసరమైన వాటిపై దృష్టి సారిస్తోందని అన్నారు.
ప్రజలను చూసి గర్వపడుతున్నా.. 10 వారాల కార్యక్రమం సక్సెస్, తగ్గిన ఆ బెడద, అరవింద్ కేజ్రీవాల్
పౌరసత్వ చట్టం అనవసరం
దేశం ఆర్థిక వ్యవస్థ కృంగిపోతున్న నేపథ్యంలో దేశంలోని నాయకులు, రాజకీయ పార్టీలు దీనిపై చర్చించాలని కోరిన అరవింద్ కేజ్రీవాల్ ఇతర అనవసరమైన అంశాలను పట్టించుకోరాదని సూచించారు. పౌరసత్వ చట్టంపై చర్చ అనవసరం అని కేజ్రీవాల్ చెప్పారు. ఆదివారం రోజున జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో నెలకొన్న హింసాత్మక ఘటనపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ పోలీసులు విద్యార్థుల మధ్య క్యాంపస్లో నెలకొన్న వాగ్వాదం గురించి కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఢిల్లీలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలని చెబుతూ అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు కేజ్రీవాల్ చెప్పారు.
భవిష్యత్ తరాలు రోడ్లపైకి ఎందుకొస్తున్నాయి..?
ఒక దేశంలో నివసిస్తున్న వారిగా కొంత బాధ్యత తీసుకోవాలని చెప్పిన కేజ్రీవాల్ 22 యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు రోడ్లపైకొచ్చి ఎందుకు ఆందోళనలు చేయాల్సి వస్తోంది అన్న విషయంపై ఆలోచన చేయాలని చెప్పారు. మన భవిష్యత్ తరాల వారు అక్కడ పోరాటాలు చేస్తున్నారని చెప్పారు . వారి గొంతుకను వినాల్సిన కనీస బాధ్యత ఉందని చెప్పారు. ఆందోళనలు చేసేవారు శాంతియుతంగా చేయాలి తప్ప హింసను ప్రోత్సహించరాదని కేజ్రీవాల్ చెప్పారు. బస్సులను ఎవరు తగల బెట్టారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తాం
ఇక వచ్చే ఏడాదిలో ఢిల్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. గత నాలుగేళ్లలో ఢిల్లీకి కేజ్రీవాల్ సర్కార్ ఏమీ చేయలేదని.. ఎన్నికలు కాబట్టి చివరి సంవత్సరంలో అన్నీ ఒకేసారి చేస్తున్నారన్న బీజేపీ విమర్శలపై సీఎం స్పందించారు. ఢిల్లీలో ప్రజలు సంతోషంగా ఉన్నారని బీజేపీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరిని ఏదో రకంగా ఆప్ సర్కార్ పలకరించిందని కేజ్రీవాల్ చెప్పారు. విద్యుత్ సరఫరా కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, లేదా నీటి సరఫరా కానీ ఇలాంటి అంశాలతో ప్రతి ఒక్క ఢిల్లీ వాసిని పలకరించామని చెప్పిన కేజ్రీవాల్... విపక్షాలను కూడా పలకరించామని చెప్పారు.
విపక్షాలు కూడా అభినందించడమే గొప్ప విజయం
తాము చేసిన మంచి పనుల గురించి చెప్పి అభినందించేందుకు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సమావేశాలకు వస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. వారి ఆశీర్వాదాలు కూడా పొందామని చెప్పారు. ఇక ఒక ఏడాదిగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. మోడీ పెద్ద వ్యక్తి అని తాను ఒక సామాన్య వ్యక్తి అని చెప్పుకొచ్చిన కేజ్రీవాల్... తాను ఢిల్లీ పాలన వరకే పరిమితం అని చెప్పారు. గత ఐదేళ్లలో విమర్శకుల నుంచి ప్రశంసలు ఆప్ సర్కార్ అందుకుందని అదే ప్రభుత్వానికి గొప్ప విజయమన్నారు కేజ్రీవాల్.