యెడ్డీ ఎఫెక్ట్: శర్మ ట్రావెల్స్ బస్సులనే కాంగ్రెస్ ఎందుకు వాడిందంటే?
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి. అయితే తమ క్యాంపులో ఉన్న కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను రక్షించుకొనేందుకుగాను కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను శర్మ ట్రావెల్స్ కు చెందిన బస్సుల్లో హైద్రాబాద్ కు శుక్రవారం నాడు ఉదయం తరలించారు.
వాస్తవానికి కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైద్రాబాద్ తరలించడానికి ముందుగా వారిని కేరళకు తరలించాలని భావించారు. కేరళలోని రిసార్ట్స్ ను కూడ బుక్ చేశారు. అయితే చివరి క్షణంలో ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలను బస్సుల్లో హైద్రాబాద్ కు తరలించారు.
కర్ణాటక ఎమ్మెల్యేలను శర్మ ట్రావెల్స్ లో హైద్రాబాద్ కు తరలించారు. అయితే శర్మ ట్రావెల్స్ అధినేత డీపీ శర్మ కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు. అందుకే కాంగ్రెస్ , జెడి(ఎస్) లను శర్మ ట్రావెల్స్ లో తరలించారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శర్మ 1980ల్లోనే బెంగళూరుకు వలస వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలతో సంబంధాలు ఏర్పాడ్డాయని అభిప్రాయాలు లేకపోలేదు.
1998లో దక్షిణ బెంగళూరు నుంచి ఎంపీగా శర్మ పోటీ చేశారు. అయితే, అనంత్కుమార్పై లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో శర్మకు సత్సంబందాలు ఉండేవి. 2001లో శర్మ చనిపోయారు. శర్మ స్థాపించిన బస్సు సర్వీసులు, కార్గో సర్వీసులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్లో లెక్సియా, వోల్వో బస్సు సర్వీసులను పరిచయం చేసింది కూడా ఈ ట్రావెల్సే.