ఔను.. వాళ్లిద్దరూ మెత్తబడ్డారు..!అందుకే దేశంలో కరతాళ నృత్యం చేస్తున్న కరోనా..!!
ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ దేశంలో మళ్లీ పంజా విసిరుతోంది. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, ఏదేశం స్పందించక ముందే భారతదేశం స్పందింది లాక్డౌన్ వంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడంతో కరోనా వ్యాప్తి కట్టడి కాగలిగిందనే చర్చ జరుగుతోంది. కాని ఈలోపే పిడుగులాంటి వార్త దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ అదుపులోనే ఉందని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుస్తుగా మేల్కొని కఠిన ఆంక్షలు అమలు చేయడంతోనే ఇది సాద్యమైందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
దేశంతో పాటు రాష్ట్రంలో పెరిగిన కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు..
సరిగ్గా ఇదే సమయంలో అటు దేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో ఆ ఇద్దరు నేతలు ఆంక్షల అమలు అంశంలో అనుసరించిన మెతక వైఖరే కరోనా విజృంభనకు కారణమనే చర్చ జరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్యలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆర్ధిక వ్యవస్ధను మళ్లీ గాడిలో పెట్టేందుకు కొన్ని వ్యవస్థలపైన ఇచ్చిన మినహాయింపుల వల్ల జనాలు మళ్లీ యదేఛ్చగా సంచరిస్తున్నారని, కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదని, కనీసం మాస్కులు పెట్టుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే కరోనా మరోసారి పంజా విసురుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మినహాయింపులే కొంప ముంచాయా.. స్వీయనియంత్రణ మర్చిపోయిన జనాలు..
నిన్న మొన్నటి వరకూ కరోనా బాదిత దేశాల్లో ఎక్కడో వెనకబడి ఉన్న భారత దేశం అమాంతంగా నాలుగో స్దానానికి ఎగబాకింది. అంటే కరోనా వైరస్ ఎంతటి ప్రమాదఘంటికలు మోగిస్తుందో అర్ధమవుతోంది. ఇటు తెలంగాణలో కూడా అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా వైరస్ సోమవారం నాడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. దీంతో ప్రభుత్వ వర్గాలతో పాటు నగర పౌరులు ఉలిక్కి పడ్డారు. కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్లుగా విభజించి మినహాయింపులు కల్పించడం వల్లే దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పురిగిపోయాయనే చర్చ వినిపిస్తోంది. అటు ప్రధాని మోదీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కరోనా అంశంలో మొత్తబడినందుకే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో పాతనగరంలో రెచ్చిపోయిన కరోనా.. ఒక్కరోజే 30 కేసులు..
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 ను కట్టడి చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుకున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంలో అప్రమత్తం చేయాల్సిన బాద్యతలను తన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు, ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ లకు వదిలేశారా అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంతకాలం నిరంతరం కరోనా వైరస్ పైనే సమీక్షలు నిర్వహించేవారు. గత రెండు రోజుల నుండి చంద్రశేఖర్ రావు వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో చంద్రశేఖర్ రావు వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రుణమాఫీ, రుతుపవనాలు, వ్యవసాయ ఏర్పాట్లు వంటివాటిపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
మెతక బడ్డ మోదీ, కేసీఆర్.. అందుకు కేసుల విజృంభణ..
అటు నార్త్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, సౌత్ లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసులు ఆందోళనకరంగా మరాయి. దేశంలో కోవిడ్-19 ఇంత విలయతాండవం చేస్తూ ప్రపంచ కరోనా బాదిత దేశాల్లో నాలుగో స్ధానానికి ఎగబాకడం పట్ల విచారం వ్యక్తం అవుతోంది. ఐనప్పటికి ప్రధాని నరేంద్ర మోదీ జనసందోహంతో కూడుకున్న కొన్ని రంగాలకు ఆంక్షలతో కూడిన మినహాయింపులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా అదుపులోకి రాకముందే ఆంక్షలు అమలు చేయడంలో ప్రధాని మోదీ మెతకబడ్డారనే చర్చ కూడా వినిపిస్తోంది. అందుకే కేసుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు, దేశంలో ప్రధాని మోదీ మత్తబడ్డందుకే మళ్లీ కరోనా కరతాళ నృత్యం చేస్తోందనే చర్చ జరుగుతోంది.