కాల్పులు జరిగిన రోజునే ఢిల్లీ పోలీస్ కమిషనర్ పదవీకాలం ఎందుకు పొడిగించారు: చిదంబరం
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్కు మరో నెలరోజుల పాటు పదవీకాలాన్ని పొడగించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. గురువారం జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేపడుతుండగా గోపాల్ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనను ఉద్దేశించి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన రోజునే ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ను మరో నెలరోజుల పాటు ఎందుకు పొడిగించాల్సి వచ్చిందని చిదంబరం ప్రశ్నించారు.
పోలీసుల ముందే గోపాల్ అనే వ్యక్తి కాల్పులు జరుపుతుండగా అతన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదని చిదంబరం ప్రశ్నించారు. కాల్పులు జరిగిన రోజున ఒకరి పదవిని పొడిగిస్తే ఆదేశాలు వెలువడగా ... ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ మేరకు చిదంబరం ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇవాళ పదవీ విరమణ పొందాల్సి ఉంది. కానీ మరో నెలరోజుల పాటు పొడిగించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే అతని పదవీకాలంను మరో నెలరోజులు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
The Police Commissioner of Delhi gets an extension on the day there is a shooting in the presence of a substantial police force
— P. Chidambaram (@PChidambaram_IN) January 31, 2020
Incomprehensible and reprehensible.
One has got an extension, but who has been suspended for the deplorable shooting yesterday?
అంతకంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి హోంశాఖ లేఖ రాసింది. ఢిల్లీ పోలీసు కమిషనర్గా పట్నాయక్ పదవీకాలాన్ని మరో నెలరోజుల పాటు కొనసాగించాలంటూ లేఖలో పేర్కొంది. ఎన్నికల సంఘం నుంచి ఇందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్రహోంశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఢిల్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అమూల్య పట్నాయక్ పదవీకాలంను పొడిగించాలని కేంద్రం భావించినందునే ఆయన్ను కొనసాగించడం జరుగుతోందని ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ పోలీస్ కమిషనర్గా పట్నాయక్ 17 జనవరి 2017లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు అలోక్ వర్మ ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఉండగా ఆయన్ను సీబీఐ డైరెక్టర్గా నియమించడంతో అమూల్య పట్నాయక్ ఢిల్లీ పోలీస్ కమిషనర్గా వచ్చారు. అయితే ఢిల్లీ పోలీస్ చరిత్రలోనే ఓ పోలీస్ కమిషనర్ పదవీకాలం పొడిగించడం ఇదే తొలిసారని ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.