అందుకే!.. రాజ్థాక్రే భార్యను కుక్క కరిచింది
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే భార్య శర్మిలను వారి పెంపుడు ‘బాండ్' కరవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. శర్మల ఆ కుక్క తోకను తొక్కడమే. చూసుకోకుండా చేసిన చిన్న తప్పుకు ఆమె తీవ్ర గాయాలపాలు కావాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఇంట్లో పడుకొని ఉన్న పెంపుడు కుక్క 'బాండ్'పై, అటుగా వెళ్తున్న శర్మిల పొరపాటున కాలు వేసిందట. దీంతో ఆగ్రహంతో ఒక్కసారిగా ఆ కుక్క ఆమె ముఖంపై దాడి చేసింది. పొడవుగా, బలంగా ఉన్న ఆ కుక్క ఒక్కసారిగా లేవడంతో ఆమె ముఖం దానికి చిక్కింది.
దాని పళ్లు పదునుగా ఉండటం, దవడ ఎముకల వరకూ పళ్లు దిగడంతో శర్మిలకు 65 కుట్లు వేయాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం దేశంలో పేరున్న ప్లాస్టిక్ సర్జన్ అనిల్ తిబరేవాలా పర్యవేక్షణలో ఉన్నారు.
కుక్క కాట్లు కనిపించకుండా చూసేందుకు ఆమెకు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. కాగా, రాజ్ థాకరే ఇంట్లో ఉన్న మూడు 'గ్రేట్ డేన్' జాతికి చెందిన శునకాలు జేమ్స్, బాండ్, షాన్లను ఫాంహౌస్కు పంపినట్టు తెలిసింది.