రాఫెల్ రగడ: సభలో ఆడియో టేపుల కలకలం..ప్రధానికి ప్రశ్నలు సంధించిన రాహుల్
Recommended Video
లోక్సభను రాఫెల్ రచ్చ మరోసారి కుదిపేసింది. రాఫైల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అంశాలను బయటకు ఎందుకు చెప్పడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
పారికర్ బెడ్రూంలో రాఫెల్ ఫైలు
రాఫెల్ డీల్పై లోక్సభలో మళ్లీ రగడ మొదలైంది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి విషయాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి ప్రధాని వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డింమాండ్ చేశారు. అంతేకాదు రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన ఫైలు నాటి రక్షణశాఖ మంత్రి ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్రూంలో ఉన్నాయని బహుశా అందుకే ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ వేసేందుకు వెనకడుగువేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పే దమ్ములేదని, బాధ్యత వహించాల్సిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడో అన్నాడీఎంకే ఎంపీల వెనక కూర్చున్నారని ధ్వజమెత్తారు.
సభలో కలకలం రేపిన ఆడియో టేపులు
రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలుకు సంబంధించిన ఫైలు మనోహర్ పారికర్ బెడ్రూంలో ఉన్నాయని గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రానే చెప్పిన ఆడియోలను సభలో వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రాహుల్ గాంధీ స్వీకర్ను కోరారు. అయితే రాహుల్ గాంధీ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. ఆడియో టేపులను సభలో వినిపించడాన్ని తప్పుబట్టారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. ధృవీకరించకుండా సభలో ఎలా వినిపిస్తారని ప్రశ్నించారు.
అనిల్ అంబానికి రాఫెల్ ఒప్పందం ఎలా కట్టబెట్టార..?
"వైమానిక రంగంలో ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీకి ఒప్పందం ఎందుకు కట్టబెట్టారు"అని రాహుల్ ప్రధానిని ప్రశ్నించారు. అంతేకాదు ఒప్పందం విలువ 16వేల కోట్ల రూపాయలకు ఎలా ఎగబాకిందని ధ్వజమెత్తారు. ఎయిర్ఫోర్స్కు 126 యుద్ధ విమానాలు అవసరం కాగా ఆ సంఖ్యను 36కు ఎందుకు కుదించారు అని రాహుల్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఒక విపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తనకుందని రాహుల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూ తాను తిలకించానని చెప్పిన రాహుల్ గాంధీ... గంటన్నర పాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరో స్క్రిప్ట్ మోడీ చదివారని ఎద్దేవా చేశారు. అంతేకాదు రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలులో దేశం అంతా చర్చించుకుంటుంటే ప్రధాని మాత్రం తమను ఎవరూ ఏమీ అనుకోవడం లేదని చెప్పడం శోచనీయమన్నారు రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటైంది
ఇదిలా ఉంటే రాహుల్ పై జైట్లీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారని అన్నారు. రాహుల్ గాంధీ అబద్దాలను నిజం చేయాలని చూస్తున్నారని జైట్లీ అన్నారు. ఈ క్రమంలోనే ఆడియో టేపులను వినిపించను గానీ... అందులో స్క్రిప్ట్ను చదివి వినిపించేందుకు అయినా అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరారు రాహుల్ గాంధీ. దీనికి కూడా స్పీకర్ అంగీకరించకపోవడంతో సభలో పెద్ద ఎత్తున రభస జరిగింది. రాహుల్ గాంధీ చదివి వినిపించే సమయంలో స్పీకర్ రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.