సోనియా భేటీకి నితీష్ డుమ్మా, మోడీతో లంచ్కు ఓకే: కారణం ఇదే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం విపక్షాల కోసం ఇచ్చిన ప్రత్యేకమైన విందుకు కార్యక్రమానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాలేదు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం విపక్షాల కోసం ఇచ్చిన ప్రత్యేకమైన విందుకు కార్యక్రమానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాలేదు. అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే విందుకు హాజరుకానున్నారు.
చదవండి: ఉత్తర ప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మారిషస్ ప్రధాని అనిరూద్ జుగనౌత్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఈ విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్తో పాటు పలువురు సీనియర్ నేతలను మోడీ ఆహ్వానించారు.
మోడీ ఇచ్చే విందుకు నితీశ్ హాజరవుతున్నట్లు జేడీయూ ప్రతినిధి అజయ్ అలోక్ తెలిపారు. ఇది ఇద్దరు నేతల మధ్య జరిగే సమావేశమే కానీ, వ్యక్తిగతమైన విషయాలను ఏమీ చర్చించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని నితీశ్ కూడా ధ్రువీకరించారు.
రాష్ట్రపతి ఎన్నికలకు ముందు సోనియా విందుకు హాజరు కాకుండా, మోడీ ఇచ్చే విందుకు హాజరవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనిపై నితీష్ స్పందించారు.
విందు అనంతరం గంగా ప్రక్షాళన గురించి మోడీతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. బీహార్ అభివృద్ధి గురించే తాను ప్రధానితో భేటీ అవుతున్నట్లు చెప్పారు.
తాను ఇప్పటికే ఏప్రిల్లో సోనియా గాంధీని కలిశానని, ఇప్పుడు ఏ అంశం మీద చర్చిస్తున్నారో అదే అంశంపై (రాష్ట్రపతి ఎన్నికలు) అప్పుడే చర్చించానని, ఇప్పుడు మాత్రం ఆమె విపక్షాలన్నింటిని ఆహ్వానించారని చెప్పారు. తమ పార్టీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షులు శరద్ యాదవ్ హాజరయ్యారన్నారు.