ప్రధాని మోడీ, కరుణానిధి భేటీ, 2జీ స్కాం తీర్పు ముందు రోజు, ఏం జరిగింది?
Recommended Video
చెన్నై/న్యూఢిల్లీ: 2జీ స్కాం కేసులో డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, ఆపార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజాతో సహ 14 మంది కేసు నుంచి బయటపడ్డారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 2017 నవంబర 6వ చెన్నైలోని గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన తరువాత ఆయన కుటుంబ సభ్యుల్లో చాల మార్పు కనిపించింది. ఆరోజు ఏం జరిగింది ? అనే విషయం ఎవ్వరికీ తెలియడం లేదు.
సూపర్ స్టార్ తో మోడీ
నవంబర్ 6వ తేదీన ప్రముఖ తమిళ దినపత్రిక దినతంతి ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ అదే కార్యక్రమంలో ఉన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆప్యాయంగా మాట్లాడారు.
కరుణానిధి ఇంటిలో మోడీ
నవంబర్ 6వ తేది సోమవారం మద్యాహ్నం 12. 30 గంటలకు గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ మద్యాహ్నం 1 గంట వరకు అక్కడే ఉన్నారు. కరుణానిధి ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు.
కరుణానిధి ప్యామిలీ
కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అయిన డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి ఇంటికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ వారి కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడారు. ముఖ్యంగా డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి కుమారుడు ఎంకే. స్టాలిన్, కుమార్తె కనిమొళితో ప్రధాని నరేంద్ర మోడీ జోకులు వేసి మరి మాట్లాడిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
ఒక్క రోజు తేడా!
2జీ స్కాం కేసులో నవంబర్ 7వ తేదీన తుది తీర్పు ఇస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలో చెప్పింది. నవంబర్ 6వ తేది అంటే ఒక్క రోజు ముందు ప్రధాని నరేంద్ర మోడీ కరుణానిధి ఇంటికి వెళ్లారు. 2జీ స్కాం కేసులో చిక్కుకున్న కరుణానిధి కుమార్తె కనిమొళితో ఉల్లాసంగా మాట్లాడిన ప్రధాని మోడీ ఆమెకు ధైర్యం చెప్పారని తెలిసింది. వీలు చూసుకుని ఢిల్లీలోని మా ఇంటికి రావాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కరుణానిధిని ఆహ్వానించారు.
45 రోజులు తరువాత!
నవంబర్ 7వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెబుతుందని అందరూ ఎదురు చూశారు. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసు ఇంకా పరిశీలించాలని, తుది తీర్పుకు సమయం పడుతోంది అంటూ డిసెంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
ఏం జరిగింది?
ప్రధాని నరేంద్ర మోడీ తన ఇంటికి వచ్చి పలకరించారని ఆనందంతో కరుణానిధి ఇంటి గుమ్మం వరకూ వచ్చి ఆయనకు విడ్కోలు పలికారు. కరుణానిధి ఆరోగ్యం గురించి ఆరా తియ్యడానికే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వచ్చారని, ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని స్టాలిన్ మీడియాకు చెప్పారు.
మోడీ భేటీతో పరిస్థితులే రివర్స్
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తరువాత కరుణానిధి కుటుంబ సభ్యులు చాలా ధైర్యంగా కనపడ్డారని స్వయంగా డీఎంకే పార్టీ నాయకులే అంటున్నారు. అయితే ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ, కరుణానిధి ఏం మాట్లాడుకున్నారు ? అసలు ఏం జరిగింది ? అనే విషయం నేటికీ బయటపడలేదు.