పాత నోట్లపై ఎందుకిలా?: ఆర్బీఐ, కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
నోట్ల రద్దు అనంతరం పాత నోట్ల డిపాజిట్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం, భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం పాత నోట్ల డిపాజిట్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం, భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రూ. 500, రూ. 1000నోట్లు రద్దయిన తర్వాత పాత నోట్లను రిజర్వ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు వీలుగా కేంద్రం మార్చి 31 వరకు గడువిచ్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం కొన్ని ఆర్బీఐ కార్యాలయాల వద్ద పాతనోట్లను తీసుకోవట్లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాత కరెన్సీ నోట్లను డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ అనుమతించట్లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించింది.
పాతనోట్లు డిపాజిట్ చేసేందుకు ప్రజలను ఎందుకు అనుమతించట్లేదో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ క్రమంలో గడువులోగా ఆర్బీఐ, కేంద్రం.. సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.