మమత బెంగాల్ కూతురు అస్త్రం సక్సెస్-బీజేపీ విలవిల- నితీశ్ అస్త్రాన్ని వాడేసిన వైనం
పశ్చిమబెంగాల్లో ఎన్నికల వేళ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీరియస్గా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు బెంగాల్ స్వాభిమాన నినాదాన్ని తెరపైకి తెచ్చిన మమత.. ఆ మేరకు బీజేపీని ట్రాప్లోకి నెట్టేసింది. గతంలో బీహార్ ఎన్నికల సందర్భంగా ఇదే కోవలో బీజేపీని అడ్డుకునేందుకు నితీశ్ కుమార్ తీసుకొచ్చిన స్ధానిక నినాదాన్ని మమత వాడేసుకున్న తీరుతో కాషాయ నేతలకు ఉక్కపోత తప్పడం లేదు.
బెంగాల్లో దీదీ వర్సెస్ బీజేపీ
ఒకప్పుడు బెంగాల్ను సుదీర్ఘకాలం ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్టులను అభివృద్ధి పేరుతో వినాశకులుగా చిత్రీకరించి గద్దె దింపిన మమతా బెనర్జీ రాజకీయాల్లో ఆరిపోయారని జనం గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. కమ్యూనిస్టుల స్ధానంలో అధికారంలోకి వచ్చిన మమత... దాన్ని సుస్ధిరం చేసుకుంటూ ఇప్పటికే రెండుసార్లు సీఎం కాగలిగారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో మాత్రం బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్ధితిని ముందే ఊహించిన మమత... సిద్ధం చేసుకున్న అస్త్రాలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
దీదీ నుంచి కూతురిగా మారిపోయిన మమత
ఒకప్పుడు బెంగాల్లో దీదీ పేరు ఫేమస్. మమత ఎక్కడికెళ్లినా ఆమెను దీదీ(సోదరి)గానే పిలిచేవారు. కానీ ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో దీదీ కాస్తా మేయీ(కూతురు)గా మారిపోయారు. దీనికి కారణం బీజేపీనే. కాషాయ పార్టీని ఎదుర్కొనేందుకు స్వాభిమాన మంత్రాన్ని ప్రయోగించిన మమత.. బెంగాల్ కూతురుగా మారితే తప్ప ప్రయోజనం ఉండదని గ్రహించారు. అంతే బెంగాల్ కూతురు కావాలా వద్దా అంటూ కొత్త నినాదం అందుకున్నారు. దీంతో సహజంగానే బెంగాలీల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన మమతా బెనర్జీ స్లోగన్ ఇప్పుడు అంతే ఆదరణ చూరగొంటోంది. ఇతరత్రా అజెండాతో మమతను ఇబ్బందిపెట్టాలనుకున్న బీజేపీ సైతం ఇప్పుడు బెంగాల్ కూతురు నినాదం చుట్టే తిరుగుతోంది.
బీజేపీని ట్రాప్లోకి నెట్టేసిన మమత ప్లాన్ ఇదే
బీజేపీ అభివృద్ధి, మత రాజకీయాలు, అరాచకాలు వంటి అంశాలను అజెండాగా చేసుకుని ఈసారి మమతను గద్దె దింపాలని ప్లాన్ చేసింది. మమత చుట్టూ ఉన్న వారిని అక్కున చేర్చుకుని వారితో అదే విషయాలు చెప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిసోంది. దీంతో మమత బీజేపీ అజెండాను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి విషయాల్లో దిట్ట అయిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం మమత కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్.. గతంలో బీహార్ ఎన్నికల సందర్భంగా తాను వాడిన లోకల్ అస్త్రాన్ని బయటికి తీశారు. అదే ఇప్పుడు బెంగాల్ సంగ్రామంలో మమతను పైచేయి సాధించేలా చేసింది. బెంగాల్ కూతురు నినాదాన్ని మమత తెరపైకి తీసుకురాగానే బీజేపీ కూడా ట్రాప్లో పడింది. మమత బెంగాల్ కూతురు కాదు మేనత్త అంటూ తన మేనల్లుడు అభిషేఖ్ బెనర్జీ అక్రమాలను గుర్తుకు తెచ్చేలా కౌంటర్లు ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
2015 నాటి నితీశ్ ప్లాన్ ప్రయోగించిన మమత
2015లో బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ, నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ కలిసి పోటీ చేశాయి. దీంతో బీజేపీ తమ పని సులువైందని భావించింది. బీహార్కు గతంలో ఆర్జేడీ రుచిచూపించిన జంగిల్ రాజ్ కావాలా అని ప్రశ్నించింది. ఆర్జేడీ, జేడీయూ ఆధ్వర్యంలోని జంగిల్ రాజ్ 2.0 కావాలా అని ప్రజల్ని బీజేపీ ప్రశ్నించింది. సరిగ్గా ఇలాంటి సమయంలో నితీశ్ పక్కనే ఉన్న ప్రశాంత్ కిషోర్ స్ధానికతను తెరపైకి తెచ్చాడు. బీహారీ కావాలా బాహరీ(బయటివాళ్లు) కావాలా అని నితీశ్ ప్రశ్నించారు. దీంతో జనం స్ధానికుడైన నితీశ్కే ఓటు వేశారు. ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణ మహాకూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీని అడ్డుకునేందుకు నితీశ్కు చెప్పిన పాఠాన్నే ఇవాళ మమతకూ చెప్పిన ప్రశాంత్ కిషోర్.. ఆ విషయంలో బీజేపీని మరోసారి ట్రాప్లోకి నెట్టాడు.