శ్రీదేవి కేసులో కొత్త ప్రశ్నలు: 'అది విచిత్రం, దుబాయ్ పోలీసుల్ని ఎలా నమ్మాలి'
ముంబై: నటి శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడి మృతి చెందారని, కేసును క్లోజ్ చేస్తున్నామని దుబాయ్ పోలీసులు మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత ఆమె భౌతికకాయాన్ని భారత్, బంధువులకు అప్పగించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే, ఇప్పుడు మరో ప్రశ్న తెర పైకి వచ్చింది. ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతిపై విచారణ జరపాల్సింది దుబాయ్ పోలీసులు కాదని, ఇక్కడి పోలీసులు అని కొందరు అంటున్నారు. శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేయడం సరికాదంటున్నారు.
అవసరం లేదని మరికొందరు
దుబాయ్ పోలీసుల విచారణ చేసిన తర్వాత భారత్ పోలీసులు విచారించాల్సిన అవసరం లేదనేది మరికొందరి వాదన. శ్రీదేవి మృతిపై చాలా మందికి అనుమానాలున్నాయని, అందుకని భారత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) కింద విచారించి అనుమానాలు నివృత్తి చేయాలని ముంబై పోలీస్ కమిషనర్ దత్తాత్రేయ పడ్సాల్గికర్కు పంపిన ఈ మెయిల్లో ఎన్జీవో జై హో ఫౌండేషన్కు చెందిన న్యాయవాది ఆదిల్ ఖాత్రి కోరారు.
సుమోటోగా స్వీకరించాలని
శ్రీదేవి మృతిని సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని మరో న్యాయవాది బాలకృష్ణన్ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు లేఖ రాశారు. శ్రీదేవి మృతి సహజంగా జరిగిందని తేలిందని, కాబట్టి మళ్లీ విచారణ అవసరం లేదని మానవ హక్కుల ఉద్యమకారిణి అభాసింగ్ అన్నారు.
ప్రతి విషయం విశ్వసించాల్సిన అవసరం ఏముంది
దుబాయ్ పోలీసులు చెప్పిన ప్రతి విషయాన్నీ విశ్వసించాల్సిన అవసరం ఏమిటని ఆదిల్ ఖత్రీ అన్నారు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత లేదని, రూమర్స్ ఆగాలంటే పారదర్శకమైన విచారణ జరగాలన్నారు.
ఇదంతా విచిత్రంగా ఉంది
మొదట గుండెపోటు వల్ల శ్రీదేవి మృతిచెందారని వార్తలు వచ్చాయని, తర్వాత ఆమె ప్రమాదవశాత్తు నీటిలో మునిగినట్లు నివేదికలు వెల్లడించాయని, ఇదంతా విచిత్రంగా ఉందని, ఫోరెన్సిక్ వైద్యులెవరూ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని నిర్ధారించలేరని బాలకృష్ణన్ అన్నారు.
ఉద్వేగ ప్రకటన
కాగా, శ్రీదేవి మృతితో తాము ఎంతో వేదన అనుభవిస్తున్నామని, మనసారా దుఃఖం అనుభవించేందుకు తగిన అవకాశమివ్వాలని ఆమె కుటుంబం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది కూడా. బోని కపూర్ వేరుగా శ్రీదేవి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఉద్వేగభరితంగా మరో ప్రకటన చేశారు.