కాంగ్రెస్కు దేశభక్తి పట్టదు, పారికర్ సమాధానం ఏది: రాహుల్-ఓ పత్రికకు నిర్మల ప్రశ్న
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి పట్టదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మల్టీనేషనల్ కంపెనీల కోసమే కాంగ్రెస్ పార్టీ తమ పైన బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. ఓ న్యూస్ పేపర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన కుట్ర పన్నిందని విమర్శించారు.
డిఫెన్స్ సెక్రటరీ నోట్కు నాటి రక్షణ మంత్రి సమాధానం ఇచ్చారని నిర్మల గుర్తు చేశారు. పీఎంవో చర్చలు జరపడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదని నాటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారని తెలిపారు. అసలు పారికర్ సమాధానాన్ని ఆ పత్రిక ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. కాగా, హిందూ పత్రికలో వచ్చిన వార్తలపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీనిపై నిర్మల స్పందించారు.
ఓ పత్రికతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. హిందూ పత్రిక ఏకపక్షంగా వార్త రాసిందని మండిపడ్డారు. ఆ పత్రిక మనోహర్ పారికర్ స్పందనను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అన్నారు.రాఫేల్ ఒప్పందంపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు. పీఎంవో సమీక్షను జోక్యం చేసుకోవడం అని చెప్పలేమన్నారు. రక్షణశాఖ నివేదికకు అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్ వివరణ ఇచ్చారన్నారు. దాని గురించి మీడియా ఎక్కడా చెప్పలేదన్నారు.
ఒప్పందం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,. అంతా సవ్యంగా జరిగిందన్నారు. దీనిపై మేం ఇటు పార్లమెంట్లోనూ అటు కోర్టులోనూ స్పష్టతనిచ్చామని చెప్పారు. ఇంకా దీనిపై మాట్లాడటం సమయం వృథా అన్నారు. కావాలనే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని, సైన్యంను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. మల్టీనేషన్ కంపెనీల చేతుల్లో వారు కీలు బొమ్మలు అయ్యారన్నారు.
రాఫెల్ ట్విస్టు: ఓ వైపు అధికారిక చర్చలు.. మరోవైపు పీఎంఓ ఎంట్రీ.. ఏంజరుగుతోంది?
పార్లమెంటులో రాఫెల్ డీల్ విషయమై శుక్రవారం గందరగోళం చోటు చేసుకుంది. విపక్ష సభ్యులు గందరగోళం మధ్యే రక్షణ మంత్రి సమాధానం చెప్పారు. రాఫెల్ డీల్ పైన రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. రాహుల్ పైన ఇప్పటికే చెప్పాల్సింది అంతా చెప్పేశామని అన్నారు. మరోవైపు, రాఫెల్ డీల్ ఆరోపణల పైన పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు.