చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, గత సోమవారం కాల్పులు చోటుచేసుకోవడంతో టెన్షన్ మరింతగా పెరిగిపోవడం, మాస్కో వేదికగా రెండు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు కీలక చర్చలు జరపడం తదితర పరిణామాల నడుమ.. శుక్రవారం జరిగిన రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. సైన్యం తరఫున త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ కమిటీ ఎదుట హాజరుకాగా, ప్యానెల్ సభ్యుడైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రశ్నలు సంధించారు.
ఏపీలో కరోనా: కొత్తగా 9,999 కేసులు - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఉభయగోదావరిలో భయానకం
భోజనంలో తేడాలు..
బీజేపీ ఎంపీ జుయెల్ ఓరం చైర్మన్ గా ఉన్న డిఫెన్స్ ప్యానెల్ లో ఇవాళ్టి సమావేశం అజెండాలో ‘‘సరిహద్దు దళాలకు అందుతోన్న రేషన్, వస్తువుల నాణ్యత'' అంశం కూడా ఉంది. దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తోన్న జవాన్లకు, అధికారులకు అందిస్తోన్న భోజనంలో తేడాలు ఎందుకు పాటిస్తున్నారు? జవాన్లకు ఒకలా, అధికారులకు మరోలా భోజనం పెట్టడమేంటి? అని సైనికాధికారుల్ని ప్రశ్నించారు. గతంలో ఇదే అంశంపై కొందరు జవాన్లు గళమెత్తడం, కాలక్రమంలో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం తెలిసిందే.
కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?
రాహుల్ మొదటిసారి..
కాగా, రాహుల్ ప్రశ్నకు అధికారులు నేరుగా సమాధానం చెప్పలేదు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా నియమితుడైన తర్వాత రాహుల్ గాంధీ హాజరైన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశంలో ప్రభుత్వం నుంచి ఆశించిన సమాధానాలు రాకపోవడంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భేటీ ముగిసిన అనంతరం ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చర్చలపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు..
ఎల్ఏసీ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు మొదలై ఆరు నెలలు కావొస్తున్నా, చైనా ఆక్రమణలకు పాల్పడుతున్నా మోదీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘ఈ ఏడాది మార్చి నుంచి మనవాళ్లు చైనాతో చర్చలు జరుపుతున్నారు. ప్రతిసారి ‘‘స్టేటస్ కో పునరుద్ధరణ'' తప్ప మరో మాట లేదు. భారత భూభాగం నుంచి చైనా బలగాలను వెనక్కి వెళ్లగొట్టే బాధ్యతను కేంద్రంగానీ, ప్రధాని మోదీగానీ నిరాకరిస్తున్నారు. అలాంటప్పుడు ఇకపై ఇతర చర్చలు పనికిరానివే అవుతాయి'' అని రాహుల్ ట్వీట్ చేశారు.
చైనా ఆక్రమణ కూడా దేవుడి చర్యేనా?
రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి ముందు కూడా చైనాతో ఉద్రిక్తతలపై రాహుల్ గాంధీ కీలక కామెంట్లు చేశారు. తూర్పు లదాక్ లో ఎల్ఏసీ వెంబడి భారత భూభాగాలను చైనా ఆక్రమించుకుందని, వాటిని తిరిగి కైవసం చేసుకునే దిశగా మోదీ సర్కార్ ఎప్పుడు చర్యలు చేపడుతుందో తెలియడం లేదని, బహుశా చైనా ఆక్రమణలను కూడా "యాక్ట్ ఆఫ్ గాడ్" అనుకుని దేవుని ఖాతాలోనే వేస్తారేమో అని రాహుల్ విమర్శించారు. కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇవ్వలేకపోవడం ‘‘యాక్ట్ ఆఫ్ గాడ్'' కిందికి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం తెలిసిందే.