మహా పోలీసులకు బాంబే హైకోర్టు ప్రశ్న: కోర్టులో విచారణ జరుగుతుండగా మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారు?
ముంబై: మానవహక్కుల నేతల అరెస్టు అంశం న్యాయపరిధిలో ఉండగా మీడియా సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. వెంటనే రాష్ట్ర పోలీస్ శాఖ సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పూణేలో ఓ కార్యక్రమం జరగడం తద్వారా భీమాకొరెగావ్లో చెలరేగిన అల్లర్లపై విచారణ చేయాల్సి ఉందని జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ బాంబే హైకోర్టులో వేసిన పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషన్కు సంబంధించిన కాపీలు సంబంధింత వ్యక్తులకు అందలేదని చెబుతూ సెప్టెంబర్ 7కు కేసు వాయిదా వేసింది.
జనవరి 1న జరిగిన భీమాకొరెగావ్ ఘటనకు కారణం దళిత హక్కుల నేతలే నంటూ వారే ఎల్గర్ పరిషద్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు ఆరోపించారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్)నుంచి నిధులు అందాయని పోలీసులు ఆరోపించారు. భీమా కోరెగావ్ ఘటనపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించినట్లు నితిన్ సత్పుటే తెలిపారు. కోర్టు ఎన్ఐఏకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని ఆయన అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా పోలీసులు మీడియా సమావేశం పెట్టడమేంటంటూ ప్రశ్నించారు.
పోలీసులు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెట్టేందకు ఎందుకు వెనకాడుతున్నారని లాయరు ప్రశ్నించారు. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి డిఫెన్స్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఇది పూర్తిగా జోక్యం చేసుకోవడమే అవుతుందని అన్నారు. ఇదే విషయం న్యాయస్థానం ప్రస్తావించిందని సెప్టెంబర్ 7లోగా సమాధానం ఇవ్వాలని చెప్పినట్లు లాయర్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే శుక్రవారం అరెస్టయిన ఐదుగురు కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరమ్ బీర్ సింగ్ మీడియా సమావేశంలో లేఖలు చదివారు. అంతేకాదు మావోల నుంచి వేల సంఖ్యలో లేఖలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాదు కొన్ని లేఖల్లో గ్రెనేడ్లను కొనేందుకు నిధులు సమకూర్చుకోవాలని రాసిఉన్నట్లు పోలీసులు తెలిపారు.